కవాడిగూడ: స్వచ్ఛంద సంస్థల సహకారంతో వసతి పొందుతూ చదువుకుంటున్న అనాథ పిల్లలకు జనన ధృవీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ సర్కిల్ 15 ఎఎంహెచ్ఓ డాక్టర్ హేమలత అన్నారు. ఈ మేరకు మంగళవారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో రెయిన్బో హోం ఫౌండేషన్ ఇండియా సహకారంతో ఎస్ఆర్డీ, అశ్రిత, అమన్ వేదిక, ఆశ్రయ్ బాల తేజస్సు, ఎస్ఇఎస్ అసోసియేషన్ ఫర్ రూరల్ అండ్ అర్బన్ నీడి తదితర స్వచ్ఛంద సంస్థల సారాథ్యంలో అనాధ పిల్లలకు జనన దృవీకరణ పత్రాల ఆవశ్యకత, ఎలా పొందాలి అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి డాక్టర్ హేమలత, జీహెచ్ఎంసీ ఎస్ వో శ్రీనివాస్ రెడ్డి, ఏఈవో శ్రీనివాస్, ఎస్ఆర్డీ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అమన్ వేదిక కో-ఆర్డినేటర్ అంబిక, రెయిన్బో హోం మేనేజర్ అరుణ్మయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హేమలత మాట్లాడుతూ అనాధ పిల్లలకు తల్లిదండ్రులు లేకపోవడంతో వారి పుట్టిన తేదీ వివరాలు తెలుసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందని, అలాంటి పిల్లల కోసం జీహెచ్ఎంసీలో నాన్ అవలబుల్ బర్త్ తీసుకోవచ్చని అన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు తమ వంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జయశ్రీ, అరుణ్జోష్, శ్రేయటక్కర్, పర్వతాలు, శివరాణి, ఎల్లయ్య, పార్వతి, అలియా, సధాకర్, అనిత, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.