కొండాపూర్ : మాదాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ డైరీ ఐస్ క్రీం పార్లర్ను సోమవారం రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై చేవెళ్ళ ఎంపీ రంజిత్రెడ్డి, ఎంఎల్సీ సురభి వాణిదేవి, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పాడి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. నష్టాలలో ఉన్న విజయ డైరీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ.700ల కోట్ల టర్నోవర్ స్థాయికి తీసుకువచ్చినట్లు తెలిపారు.
పాల ఉత్పత్తులను మరింత పెంచేందుకు రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాల గ్రామ పరిధిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక టెక్నాలజీతో రూ. 246 కోట్ల వ్యయంతో మెగా డెయిరీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. విజయ డైరీకి పాలు అందించే పాడి రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా 1500ల లీటర్ల పాలు అందించే రైతులకు గడ్డి కోసే యంత్రాలతో పాటు పాల క్యాన్లను ఇతర ప్రోత్సహాకాలు అందజేస్తున్నట్లు తెలిపారు.
పాడి రైతులకు నగదు ప్రోత్సహకాలను సైతం అందజేస్తున్నట్లు, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రూ. 343 కోట్లను అందజేసినట్లు తెలిపారు. దురదృష్టవశాత్తు పాడి రైతులు మరణిస్తే అంత్యక్రియల ఖర్చులతో పాటు వారి ఇండ్లలో పిల్లలు వైద్య విద్యలో, ఐఐటీ, జేఈఈలలో సీటు సాధిస్తే నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు.
విజయ డైరీ ఐస్క్రీం పార్లర్లో నాణ్యతతో కూడిన అన్ని రకాల ఐస్ క్రీంలు, పాల ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ సెక్రటరీ ఆధార్ సిన్హా, డైరెక్టర్ రాంచందర్, కార్పొరేటర్లు హమీద్ పటేల్, జగదీశ్వర్గౌడ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.