బేగంపేట్ : ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. సోమవారం రాంగోపాల్పేట్ డివిజన్లో వివిధ ప్రాంతాల్లో ఆయన స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్రతో కలిసి వివిధ రకాల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు.
ఎంజీ రోడ్డులోని ఆజామ్ హోటల్ వద్ద రూ. 14 లక్షలతో చేపట్టనున్న సివరేజ్ పైపులైన్ పునరుద్ధరణ పనులు ప్రారంభిం చారు. అలాగే మెక్లాడ్గూడలో రూ. 18.50 లక్షలతో చేపట్టనున్న స్టాం వాటర్ డ్రైన్ పనులు, అలాగే జవహార్నగర్లోని లక్ష్మీ నారాయణ అపార్ట్మెంట్ వద్ద రూ.42 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు, స్టాంవాటర్ డ్రైన్ మరమ్మత్తుల పనులు ప్రారంభించారు.
ఆజం హోటల్ సందులో టాయ్లెట్స్ నిర్మించాలని స్థానికులు కోరగ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తమ సమస్యలను పరిష్కరిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కు రాంగోపాల్పేట్ డివిజన్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివావాసరెడ్డి, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, జలమండలి జీఎం రమణారెడ్డి, ఏసీపీ క్రిష్టఫర్, తదితరులు పాల్గొన్నారు.