కొండాపూర్ : చందానగర్లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో శ్రీవారి జన్మ నక్షత్ర శ్రవణా నక్షత్రం సందర్భంగా గురువారం సామూహిక కళ్యాణోత్సవం, మహాపుష్ప యాగాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలను ప్రారంభించారు.
విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీవారికి పంచామృతాభిషేకం, విశేషాలంకారం, సామూహిక శ్రవణా నక్షత్ర కళ్యాణోత్సవం, ప్రధాన హోమములు, పుర్ణాతి, మహాపుష్ప యాగాలనంతరం హారతి తీర్థప్రసాదములను భక్తులకు అందజేశారు.
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయని, నిత్యం వేలాది మంది భక్తులు భగవంతుని దర్శనంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని ఆలయ అర్చకులు సాయి తెలిపారు. పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.