సిరికొండ, డిసెంబర్ 31 : కరోనాను కట్టడి చేయడంతో పాటు ఒమిక్రాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కొవిడ్ టీకా ఇవ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2022 జనవరి 3 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించనుంది. జిల్లాల్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యసిబ్బంది ఇంటింటికీ సర్వే చేసి 15 నుంచి18 ఏళ్ల లోపు వారి వివరాలు సేకరిస్తున్నారు. పది, ఇంటర్, డిగ్రీ ప్రథమ సంవత్సరం చదివే విద్యార్థులతో పాటు టీనేజర్లందరికీ టీకా ఇచ్చి కరోనాను నియంత్రించేం దుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
నేటి నుంచి రిజిస్ట్రేషన్
టీనేజర్లకూ టీకా పంపిణీ ప్రక్రియ ఈ నెల 3 నుంచి ప్రారంభించనుండడంతో ఒకటో తేదీ నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అర్హులు కొవిడ్ యాప్లో లేదా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆదిలాబాద్ జిల్లాలో 49వేల మందికి పైగా టీనేజర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆధార్ కార్డుతో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
తల్లిదండ్రులకు సమాచారం
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ నెల 3 నుంచి జిల్లాలోని టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో 15-18 ఏళ్లలోపు వారు 2 లక్షల మంది వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. 2007 నుంచి జన్మించిన వారి వివరాలు సేకరిస్తున్నారు. వారికి ముందస్తుగా టీ కా వేసేందుకు ప్రస్తుతం 30 వేల డోసులు సిద్ధం గా ఉంచారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న 15 నుంచి 18 ఏళ్లలోపు బాలబాలికలతో పాటు బయట ఉన్న వారికి సైతం టీకా వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం నేరుగా పాఠశాలలు, కళాశాలల వద్దే వ్యాక్సిన్ ఇచ్చేందుకు వైద్యారోగ్య శాఖ కార్యాచరణ రూపొందించింది. విద్యార్థులకు విద్యాసంస్థల్లోనే కొవ్యాక్సిన్ వేయనున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్ల ద్వారా సమాచారం ఇవ్వనున్నారు.
60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్
జిల్లాలో 60 ఏళ్ల వయసు దాటి, వారికి దీర్ఘకాలిక వ్యాధులుంటే బూస్టర్ డోస్ వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఈ డోస్ వేయనున్నారు. వైద్యుల నుంచి టీకా అవసరమని చెబితే చాలు ఇలాంటి వారికి వచ్చే నెల నుంచి వ్యాక్సిన్ వేస్తామని వైద్యాధికారులు తెలిపారు.
టీకా పంపిణీకి చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో 15 నుంచి18 ఏళ్లలోపు వారికి జనవరి 3వ తేదీ నుంచి కొవిడ్ టీకా పంపిణీ చర్యలు చేపట్టాం. ఇప్పటికే వైద్య సిబ్బంది వివరాలు సేకరించారు. జనవరి 1 నుంచి కొవిడ్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి వ్యాక్సిన్ వేస్తాం. అర్హులందరూ టీకా తీసుకొని ఒమిక్రాన్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి.
మెట్పెల్లి వార్ శ్రీకాంత్, ఆదిలాబాద్ డీఐవో