గద్వాలటౌన్, జనవరి 2: కొవిడ్ టీకా 15-18సంవత్సరాల ఏండ్ల మధ్య వారికి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే వ్యాక్సినేషన్కు జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ జోగుళాంబ గద్వాల జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే 15-18ఏండ్ల మధ్య వయస్సు ఉన్నవారు 46,671 మంది ఉన్నట్లు అంచనా వేసింది. వీరందరికీ కూడా వ్యాక్సిన్ వేయించేలా వైద్యాధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో 21వేల కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 10నుంచి హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్లైన్ వర్కర్లకు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వృద్ధులకు బూస్టర్ డోస్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు.
ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు
వ్యాక్సిన్ వేయడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 15ప్రత్యేక కేంద్రాలతో పాటు జిల్లా దవాఖాన, అన్ని పీహెచ్సీలలో అలంపూర్ సీహెచ్సీతో పాటు జిల్లా కేంద్రంలోని అర్బన్ హెల్త్ సెంటర్లలో వ్యాక్సిన్ వేస్తారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు టీకా వేస్తారు. ఇందుకుగానూ వైద్యాధికారులకు, సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.
గుర్తింపు కార్డు తప్పనిసరి..
వ్యాక్సిన్ వేయించుకోవాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి ఉండాలని వైద్యాధికారులు వెల్లడించారు. ఆధార్కార్డు, రేషన్కార్డుతో ఏదైనా గుర్తింపు కార్డు తప్పక ఉండాలి. విద్యార్థులైతే ఐడీ కార్డు ఉన్న సరిపోతుందని అధికారులు తెలిపారు. కొవిన్ పోర్టల్ నమోదు చేసుకోవచ్చు. లేదా వ్యాక్సిన్ కేంద్రాలకే నేరుగా వెళ్లి టీకా తీసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్నాక అరగంట కేంద్రంలోనే ఉండాలి. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వైద్యాధికారులు పరిశీలిస్తారు. 28రోజుల తరువాత రెండో డోస్ ఇస్తారు.
తప్పనిసరి వేయించుకోవాలి
15-18సంవత్సరాల వారు వ్యాక్సిన్ తప్పక వేయించుకోవాలి. పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు, కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు విద్యార్థులకు వ్యాక్సిన్ వేయించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. మాస్క్ను తప్పనిసరి పెట్టుకోవాలి. అలాగే నియమ నిబంధనలు పాటించాలి.