మన్సూరాబాద్ : పేదింటి ఆడబిడ్డ పెండ్లికి నాగోల్లోని ఉప్పల ఫౌండేషన్ అపన్నహస్తం అందించి చేయూతనిచ్చింది. కొత్తపేట గ్రామానికి చెందిన నేమూరి నాగేష్, వనజ దంపతుల కుమార్తె తేజస్విని వివాహం ఇటీవల నిశ్చయమైంది. నేమూరి నాగేష్, వనజ దంపతుల ఆర్థిక పరిస్థితిపై కొందరు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా దృష్టికి తీసుకెళ్లారు.
విషయాన్ని తెలుసుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా సదరు కుటుంబంలో జరుగుతున్న పెండ్లికి తన వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నాగోల్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తేజస్విని పెండ్లికి గాను పుస్తె, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా ఆమెతో పాటు వచ్చిన కుటుంబసభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన పేదలకు ఉప్పల ఫౌండేషన్ ద్వార చేయూతనిస్తున్నామని తెలిపారు. పేద కుటుంబాలలో జరిగే పెండ్లిళ్లకు తమ వంతు సహకారం అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మొగుళ్లపల్లి ఉపేందర్, చొల్లేటి ఆనంద్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.