అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి ఆర్థిక సహాయం
మన్సూరాబాద్ : అనారోగ్యంతో బాదపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ కుటుంబానికి ఉప్పల ఫౌండేషన్ అపన్నహస్తం అందించింది. లంగర్హౌజ్, ఎండీ లైన్కు చెందిన మహ్మద్ హబీబ్ జమామ్ఖాన్కు ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. డయాలసిస్ చేసుకోవల్సి రావడంతో పనికి వెళ్లడం కష్టంగా మారి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
ఈ విషయాన్ని కొందరు వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. సహృదయంతో వెంటనే ఉప్పల శ్రీనివాస్ గుప్తా స్పందించి ఉప్పల ఫౌండేషన్ సహకారంతో రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని మంగళవారం నాగోల్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహ్మద్ హబీబ్ జమామ్ఖాన్ భార్య ఉజ్మాకు నిత్యావసర సరుకుల నిమిత్తం అందజేశారు.
పేదింటి ఆడబిడ్డ పెండ్లికి చేయూత
పేదింటి ఆడబిడ్డ పెండ్లికి నాగోల్లోని ఉప్పల ఫౌండేషన్ అపన్నహస్తం అందించి చేయూతనిచ్చింది. సిద్దిపేట జిల్లా, నారాయణరావు పేట మండలం, లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన దండు రాములు, ఎల్లవ్వ కూతురు అనూష వివాహం ఇటీవల నిశ్చయమైంది.
దండు రాములు, ఎల్లవ్వ దంపతుల కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కొందరు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని తెలుసుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నాగోల్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనూష వివాహానికి గాను పుస్తె, మెట్టలు, చీర, గాజులను సదరు యువతి కుటుంబసభ్యులకు ఆయన విరాళంగా అందజేశారు.