సుల్తాన్బజార్ : ప్రయాణీకులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న టీఎస్ఆర్టీసీని మరింత అభివృధ్ది పరిచేందుకు కృషి చేస్తానని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఈ సంధర్భంగా తన వాహనంలో కాకుండా ప్రత్యేకించి ఆర్టీసీ బస్సులలో సాధారణ ప్రయాణీకుడిలా టిక్కెట్ తీసుకొని ప్రయాణించడం విశేషం. నగరంలోని లక్డీకాపూల్ నుండి నాంపల్లి, అక్కడి నుండి అఫ్జల్ గంజ్, సీబీఎస్ వరకు మూడు బస్సులలో సాధారణ ప్రయాణీకుడిలా టిక్కెట్ తీసుకొని ప్రయాణించడం విశేషం.
ఆర్టీసీ ఎండీగా భాధ్యతలు చేపట్టిన ఆయన మొట్టమొదటిసారి ఎంజీబీఎస్ కు వస్తున్న తరుణంలో బస్సులలో కండక్టర్లు ప్రయాణీకులతో ఎలా వ్యవహరిస్తున్నారని తెలుసుకునేందుకు ఆర్టీసీలో ప్రయాణించారు. అంతేకాకుండా సీబీఎస్ హాంగర్ నుండి ఎంజీబీఎస్ వరకు కాలినడకన వచ్చి అన్ని ఫ్లాట్ఫాంలను కలియ తిరుగుతూ, పారిశుద్ధ్య పరిస్థితులను పర్యవేక్షించడంతో పాటు మురుగుదొడ్ల పర్యవేక్షణ ఎలా ఉందో స్వయంగా పరిశీలించారు.
ఆయన ఆకస్మిక పర్యటనతో ఉద్యోగులు ఉరుకులు పరుగులు పెట్టారు.సుమారు గంట సేపు ఎంజీబీఎస్ లో గడిపిన అనంతరం ఉద్యోగులు ఆయనను గుర్తించడం విశేషం. తదనంతరం ఈడీ కార్యాలయంలో హైదరాబాద్, కరీంనగర్ జోన్ ఈడీ పివీ మునిశేఖర్, రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ బి వరప్రసాద్, హెడ్ రీజియన్ ఆర్ఎం వెంకన్న, డీవీఎం ఎంఆర్సీ రెడ్డి, సీఆర్ఎం విష్ణువర్ధన్ రెడ్డి, అసి స్టెంట్ మేనేజర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఎంజీబీఎస్ లోని అన్ని డిపోలలో బస్సుల వివరాలు, ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఆర్టీసీని మరింత అభివృద్ది పరిచే దిశగా అడుగులు ముందుకు వేస్తామని ఆయన అన్నారు.అనంతరం ప్రాంగణంలో ఉన్న కండక్టర్ల జాబ్ చార్ట్ను పరిశీలించారు.ఈ సంధర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు ఆయనకు పుష్పగుచ్చాలు అందించారు.