తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ ప్రభుత్వ జవహార్ బాలభవన్, బాలకేంద్రాలలో సెప్టెంబర్ ఒకటి నుండి విద్యార్థులకు శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని బాలభవన్ సంచాలకురాలు ఉషారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ ఆదేశాలతో కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి పాఠశాలలను ప్రారంభించాలనే ఉత్తర్వుల నేపథ్యంలో బాలభవన్ కేంద్రంలో చిత్రలేఖనం, భరతనాట్యం, ఇన్నోవేటివ్ సైన్స్, క్రియేటివ్ రైటింగ్, యోగా, స్కేటింగ్ తదితర అంశాలలో శిక్షణా తరగతులు కొనసాగుతాయని ఆమె ప్రకటించారు.
నాంపల్లి పబ్లిక్గార్డెన్ ప్రాంగణంలో గల బాలభవన్ కేంద్రంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో గల బాలభవన్, బాల కేంద్రాలలో కేటాయించిన సమయాలలో ప్రత్యక్ష శిక్షణా తరగతులు ప్రారంభిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. రాష్ట్రంలోని బాలభవన్, బాల కేంద్రాలలో శిక్షణ పొందాలనుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల బోనాఫైడ్ సర్టిఫికేట్ అందించి ఉచిత శిక్షణ పొందవచ్చన్నారు. ఇతర విద్యార్థులు నూతన సభ్యత్వం రుసుము యాబై రూపాయలు చెల్లించాలని సూచించారు. పుట్టిన తేదీ సర్టిఫికేట్, రెండు ఫోటోలు కేంద్రంలో సమర్పించాలని కోరారు. నూతన సభ్యత్వం కోసం సంబంధిత అధికారిని లలితకుమారి 7095035959నెంబర్లో సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని విద్యార్థులకు ఉషారాణి వెల్లడించారు.