మణుగూరు రూరల్, జనవరి 8 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బీటీపీఎస్(భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్) పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు-పినపాక సరిహద్దు గ్రామాల్లో దాదాపు 1,170 ఎకరాల స్థలంలో (4×270) మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ, అధికారుల నిరంతర శ్రమతో వడివడిగా అడుగులు వేస్తూ ఒక్కో యూనిట్ను పూర్తిచేసుకుంటున్నది. ఆదివారం నాల్గో యూనిట్ సీఓడీ పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. రాష్ర్టాన్ని విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు బీటీపీఎస్ అధికారులు శ్రమిస్తున్నారు. కరోనా సమయంలో పంజాబ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ర్టాల నుంచి వచ్చిన ఇంజినీర్లు, కార్మికులు విధులకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఎండ ప్రభావం కార్మికులపై చూపకుండా పనివేళల్లో మార్పులు చేశారు. పనికి అంతరాయం ఏర్పడకుండా జెన్కో సీఎండీ ప్రభాకర్రావు బీహెచ్ఈఎల్ యాజమాన్యంతో మాట్లాడి చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి థర్మల్ పవర్స్టేషన్ నాల్గో యూనిట్ సీఓడీ(కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్)కు సిద్ధమైంది. సీఓడీ జరగాలంటే పూర్తిస్థాయిలో 72గంటల పాటు విద్యుదుత్పత్తి జరగాల్సి ఉండగా, ఉన్నతాధికారులు డైరెక్టర్(పా) ఎం.సచ్చిదానందం, సీఈటీపీసీ ఆపరేషన్స్ పీవీ.శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నా రు. ఆపరేషన్స్, టెక్నికల్ సిబ్బందికి సలహా లు, సూచనలు ఇస్తూ షిఫ్టుకి 15 మంది ఇంజినీర్లతో సీఓడీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సీఎండీ ప్రభాకర్రావు నాల్గో యూనిట్ సీఓడీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. చివరి దశ నాల్గో యూనిట్ సీఓడీ పూర్తయితే ప్రస్తుతం బీటీపీఎస్ నుంచి 810 మెగావాట్లు రాష్ట్ర గ్రిడ్కు అనుసంధానం అవుతుండగా, మరో 270 మెగావాట్లు గ్రిడ్కు అదనంగా చేరనున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరింత ప్రయోజనం చేకూరనున్నది.