కాచిగూడ : గత కొన్నేండ్లుగా పెండింగ్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు నిర్మాణ పనులకు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సహాకారంతో ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీ పడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. రూ.40 లక్షల రూపాయలతో కాచిగూడ రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు నిర్మాణ పనులను సోమవారం కాచిగూడ కార్పొరేటర్ ఉమాదేవితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
గత 12 యేండ్లుగా కాచిగూడ రైల్వేస్టేషన్ నుండి ఆర్టీసీ క్వార్టర్స్కు వెళ్లే అండర్ బ్రిడ్జి రహదారి అద్వాన్నంగా తయారైంది. స్థానికులు అనేక మార్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్కు పిర్యాదు చేయగా స్పందించిన ఎమ్మెల్యే ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసి అండర్ బ్రిడ్జి రోడ్డు పరిస్థితిని వివరించారు. స్పందించిన రైల్వే జీఎం వెంటనే రోడ్డు నిర్మాణానికి నిధులను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్లోర్లీడర్ దిడ్డి రాంబాబు, అధికారులు కాచిగూడ రైల్వేస్టేషన్ డైరెక్టర్ వెంకన్న, రామారావు, మల్లికార్జున్, శంకర్, ప్రేరణ, రవి, గోల్నాక టీఆర్ఎస్ అధ్యక్షుడు భరత్రాజ్ తదితరులు పాల్గొన్నారు.