ఆర్కేపురం : సరూర్నగర్ డివిజన్లో పార్టీ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం ఆర్కేపురం డివిజన్ వాసవి కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సరూర్నగర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకుల, కార్యకర్తల సమావేశాన్ని డివిజన్ అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్ అధ్యక్షత నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని, ఆదిశగా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందన్నారు. డివిజన్లో ఉత్సాహవంతులతో కూడిన కమిటీల ను ఏర్పాటు చేసి పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేసుకుందామని చెప్పారు. డివిజన్ కమిటీలకు తోడుగా అనుబంధ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.ప్రతి డివిజన్లో సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేసుకుందామన్నారు.
రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టవంతంగా తీర్చిదిద్దేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సారథ్యంలో మార్పులు జరుగుతాయని చెప్పారు. పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేసే ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. పాత కొత్త అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని ముందుకెళాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, నాయకులు పారుపల్లి దయాకర్రెడ్డి, లోకసాని కొండల్రెడ్డి, సిరిపురం రాజేష్గౌడ్, రాఘవేంద్రగుప్త, శేఖర్రెడ్డి, పోలే సుధామ, పి.రాజు, ప్రత్యూష్, ప్రవీణ్, మల్లేష్, సలీం తదితరులు పాల్గొన్నారు.