ముషీరాబాద్ :అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని తెలంగాణ విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సాహితీకారుడు దేవులపల్లి రామానుజరావు అని తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు అన్నారు. ఎందరో మాహానుభావుల మధుర స్మృతులతో కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సాహితీవేత్త దేవులపల్లి రామానుజ రావు జయంతి సభ గురువారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభాకర రావు ముఖ్య అతిధిగా పాల్గొని రామానుజరావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నాటి తెలంగాణ పత్రికలు గోల్కొండ, తెలంగాణ శోభ పత్రికలకు సంపాదకులుగా పని చేసిన రామానుజరావు తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారని కొనియాడారు. సహజ భాషలో పాండిత్యం సంపాదించి తెలుగు భాషా సేవలో నిమగ్నమైన గొప్ప వైతాళికుడని అన్నారు. టీఎన్జీఓ పూర్వ నేత దేవీప్రసాద్ మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా తెలుగు భాషా, రచనల పరివ్యాప్తికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పొత్తూరి సుబ్బారావు, జీవీఆర్ ఆరాధన సంస్థ అధినేత గుదిబండి వెంకట్రెడ్డి, బ్రాహ్మణ ఐక్యవేదిక కార్యదర్శి భమిడి ఉష తదితరులు పాల్గొన్నారు.