కొండాపూర్ : తెలుగు భాష పరిరక్షణకు అధికారభాషా సంఘానికి సంపూర్ణ అధికారాలను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్పర్సన్ నందిని సిధారెడ్డి అన్నారు. తెలుగు భాష దినోత్సవాలలో భాగంగా తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తల ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన ‘తెలుగు కోసం నడక’ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి మాతృభాష పరిరక్షణ సమితి, తెలుగు వెలుగు సాహితీ వేధిక, ఎస్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య అభిమానులు ఆదివారం తరలివెళ్ళారు.
ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార భాష సంఘం అలంకారప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పాలనా, కార్యాలయ, భోధన భాషగా తెలుగును అమలు చేయా లన్నారు. ఈ కార్యక్రమంలో భాషా పండితులు, రచయితలు కోదండరాం. నాళేశ్వరం శంకరం, చంద్రప్రకాశ్రెడ్డి, బడేసాబ్, కవయిత్రులు లక్కరాజు నిర్మల, దాసోజు పద్మావతి, వాణి, మాతృభాష పరిరక్షణ సమితి అధ్యక్షులు మావిశ్రీ మాణిక్యం, ఎస్వీ ఫౌండేషన్ చైర్మెన్, తెలుగు వెలుగు సాహితీ వేదిక, మాతృభాష పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి మోటూరి నారాయణ రావు, అక్షర కౌముది అధ్యక్షులు తులసి వెంకటరమణాచార్యులు, కవి రాందాస్ తదితరులు పాల్గొన్నారు.