ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీస్ శాఖ నడుంబిగించింది. డ్రగ్స్ వినియో గిస్తున్న వారిలో ఎక్కువగా యువత, విద్యార్థులే ఉంటుండడంతో వారిలో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. డ్రగ్స్ వలన కలిగే దుష్ఫలితాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్యాసంస్థల్లో సైతం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా హైదరాబాద్ నగర పోలీసుల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద డ్రగ్స్ అవేర్ నెస్ వాక్ను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హాజ రయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలరోజులుగా రాష్ట్రమంతా అవగాహనా కార్యక్రమాలు జరుగుతు న్నాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమంతో సహా అన్ని విషయాలలో యూనివర్సిటీ విద్యార్థులపాత్ర ఎంతో ఉందన్నారు.
ఓయూ విద్యార్థులను రాష్ట్రమంతా ఆదర్శంగా తీసుకుంటుందని పేర్కొన్నారు. అందుకే ఓయూలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. దేశానికి యువత ఎంతో అవసరమని, అటువంటి యువత మాదకద్రవ్యాలకు బానిస కాకూడదని సూచించారు. ఎవరైనా మత్తుపదార్థాలకు బానిసలుగా మారినట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.
డ్రగ్స్ రహిత సమాజం నిర్మించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం మత్తు పదార్థాలు విచ్చలవిడిగా లభిస్తున్నాయని, విద్యార్థులకు సైతం అవి అందుబాటులోకి వచ్చాయన్నారు. పర్యావసనాలు తెలియక చాలా మంది వాటిని వినియోగిస్తున్నారని అభిప్రాయపడ్డారు. డ్రగ్స్కు సంబంధించి యువతకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు.
పోలీస్, ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ వంటి అన్ని విభాగాలు ముందుకు వచ్చి కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. అందరూ కలిసి రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. ఈ బృహత్కార్యానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ రమేశ్రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, అడిషనల్ డీసీపీ మురళీధర్, ఏసీపీలు ఆకుల శ్రీనివాస్, వెంకటరమణ, సీఐ రమేశ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.