అమీర్పేట్ : సనత్నగర్ అల్లాద్దీన్ కోఠీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రూ . 93.60 లక్షల వ్యయంతో సనత్నగర్ డివిజన్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
దాసారం బస్తీ కమ్యూనిటీ హాలు వద్ద రూ. 36 లక్షల వ్యయంతో చేపట్టనున్న సివరేజీ పైపులైను నిర్మాణ పనులకు, మోడల్కాలనీలో రూ. 18.60 లక్షల వ్యయంతో చేపడుతున్న వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులకు, సౌభాగ్యనగర్ చౌరస్తాలో రూ. 27 లక్షలతో చేపడుతున్న సివరేజీ లైను నిర్మాణ పనులకు మంత్రి తలసాని శంకుస్థాపన చేశారు.
వీటితో పాటు రూ. 12 లక్షలతో తీర్చిదిద్దిన సనత్నగర్ అశోక్కాలనీ, అల్లాద్దీన్ కోఠీలలోని పవర్ బోర్లను మంత్రి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లాద్దీన్ కోఠీ వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా తాము నివసిస్తున్న స్థలాలపై ఎటువంటి హక్కులు లేకుండా అభద్రతా భావంలో ఉన్న బస్తీ వాసులకు ప్రభుత్వం పట్టాలంద జేసేలా చొరవ తీసుకున్నది టీఆర్ఎస ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
బస్తీలో మెరుగైన మంచినీటి, డైనేజీ వ్యవస్థలను తీర్చిదిద్దామన్నారు. కోఠీని ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతానని బస్తీ వాసులకు హామీ ఇచ్చారు..
నలుమూలలకు బస్సులు తిరిగేలా చూస్తా..
సనత్నగర్ నుండి నగర నలుమూలలకు బస్సులు నడిచేలా సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని మంత్రి సనత్నగర్ నివాసితులకు హామీ ఇచ్చారు. గత రెండేళ్ళుగా సనత్నగర్ నివాసితులు బస్సుల ద్వారా రాకపోకలు సాగించాలంటే.. ఎర్రగడ్డ బస్టాపుకు చేరుకోవాల్సి వస్తోందన్నారు.
ఒక్క సికింద్రాబాద్ మినహాయించి మరెక్కడికి సనత్నగర్ నుండి బస్సు సదుపాయం లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి మంత్రి తలసాని దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి తలసాని హామీతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొలను బాల్రెడ్డి, బోగి బాల్రాజ్, ఫాజిల్, సురేష్గౌడ్, సంతోష్ సరఫ్, ఆంజనేయులు యాదవ్, కోఠీ బస్తీ అధ్యక్షులు రఫీఖ్లతో పాటు పెద్దసంఖ్యలో స్థానిక బస్తీ, కాలనీ నివాసితులు పాల్గొన్నారు.