అమీర్పేట్ : సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకునే దిశగా తెలంగాణ సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలతో బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తమైందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ద్వారా బతుకమ్మ విశిష్ఠతను విశ్వవ్యాప్తం చేసేందుకు నాటి ఉద్యమ నేత కేసీఆర్, జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కవిత వంటి వారు ఎంతో శ్రమించారన్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో బతుకమ్మను ఎనలేని ప్రాముఖ్యతనిస్తూ.. ప్రతి మహిళకు బతుకమ్మ చీరను పండుగ బహుమతిగా అందజేయాలన్న సర్కార్ నిర్ణయం మహిళలను ఎనలేని సంతోషాన్నిస్తోందన్నారు. ఆదివారం అమీర్పేట్ డివిజన్లోని వివేకానంద కమ్యూనిటీ హాలులో జరిగిన బతుకమ్మ చీరల పంపిణీని కార్పొరేటర్ కేతినేని సరళ, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారిలతో కలిసి ప్రారంభించారు.
అలాగే బేగంపేట్ పాటిగడ్డలోని మోడల్ మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో స్థానిక కార్పొరేటర్ మహేశ్శరి శ్రీహరితో కలిసి లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేశారు.