చిక్కడపల్లి : కేంద్రం బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్నిఖూనీ చేసి హక్కులను కాల రాస్తోందని సీపీఎం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. తెలంగాణ సీపీఎం రాష్ట్ర సమావేశాల సందర్భంగా గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు.
ఈ సందర్భంగా బి.వి.రాఘవులు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ మంత్రి మౌర్య బిజేపీ విధానాలు నచ్చక రాజీనామా చేసి ఎస్సీలోకి వెళ్లితే అతని పై పాత కేసులు పెడుతున్నారని విమర్శించారు.ప్రత్యర్థులపై ఇలాంటి వేధింపులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులు నిలవాలన్నారు. ధరలను నియంత్రించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వివరించారు.
డీజిల్, పెట్రోల్ మీద కేంద్ర ఆదాయం సమకూర్చు కోవాలనుకుంటుందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ధరల పెరుగుదలపై సీపీఎం ఇతర పక్షాలతో కలిసి పోరాటం చేస్తామని అన్నారు. కేంద్రం సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తోందని, సమాఖ్య వ్యవస్థను రక్షించేందుకు రాష్ట్ర సీఎం కేసీఆర్ కలిసి రావాలని అన్నారు.
బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందని వివరించారు. బీజేపీ ప్రభుత్వం హామీలను విస్మరించి విధ్వంసాన్ని రెచ్చగొడుతుందని అన్నారు. తెలంగాణలో భాగ్యనగర్ పేరుతో మత విద్వేషాలు రెచ్చగొడుతోందని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి 25 వరకు సీపీఎం రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని తెలిపారు.