పాపన్నపేట, జనవరి 2 : ఏడుపాయల్లో వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం తలనీలాలు, కుంకుమార్చనలు, బోనాలు సమర్పించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సార శ్రీనివాస్ సిబ్బందితో తగిన ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. వేదపండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడుపాయల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పాపన్నపేట పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. పూజా కార్యక్రమాల్లో తూప్రాన్ డీఎస్పీ కిరణ్కుమార్, పాపన్నపేట తహసీల్దార్ లక్ష్మణ్, పాపన్నపేట ఎస్సై సురేశ్, విఠల్, కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.
‘కొమురవెల్లి మల్లన్న’కు భక్తుల పూజలు
చేర్యాల, జనవరి 2 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సుమారు 15 వేల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపారు. భక్తులు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టారు. కొందరు భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవం మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన ఉన్న ఎల్లమ్మకు బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఈవో బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ధర్మకర్తలు, సిబ్బంది, అర్చకులు భక్తులకు సేవలందించారు.
మెదక్ చర్చిలో భక్తుల ప్రార్థనలు
మెదక్ మున్సిపాలిటీ, జనవరి 2 : మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం ఏసయ్య సన్నిధికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ అండ్రూస్ ప్రేమ్సుకుమార్ భక్తులనుద్దేశించి సందేశం ఇచ్చారు. చర్చి గురువులు దయానంద్, రాజశేఖర్, డేవిడ్ భక్తులను ఆశీర్వదించారు. భక్తులు చర్చిలోని వసతి గృహాలు, చెట్ల కింద వంటావార్పు చేసుకున్నారు.
హైకోర్టు జడ్జి పూజలు
పాపన్నపేట/చిలిపిచెడ్/సంగారెడ్డి అర్బన్, జనవరి 2 : ఏడుపాయల వనదుర్గాభవానీమాత, సంగారెడ్డిలోని వైకుంఠపురం, చిలిపిచెడ్లోని చాముండేశ్వరీ ఆలయాలను హైకోర్టు జడ్జి వెంకటేశ్వర్రెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకునిపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి వెంట ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి, సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత, నర్సాపూర్ జడ్జి అనిత, తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్, నర్సాపూర్ సీఐ లింగేశ్వర్రావు, ఎస్సైలు మల్లారెడ్డి, శ్రీనివాస్గౌడ్, జోగిపేట ఎస్సై వెంకటేశం ఉన్నారు.
శివనామస్మరణతో మార్మోగిన ‘కేతకీ’
ఝరాసంగం, జనవరి 2 : ఝరాసంగంలోని దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన పార్వతీ సమేత సంగమేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం శూన్య అమావాస్య కావడంతో తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. భక్తులు యజ్ఞ మండపంలో పార్వతీ సమేత సంగమేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలకు కుంకుమార్చన, రుద్రాభిషేకం, పాలాభిషేకంతో పాటు అన్నపూజ నిర్వహించారు. భక్తులకు వేదపండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. సీడీసీ చైర్మన్ ఉమాకాంత్పాటిల్, సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్, ఎంపీటీసీ విజేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, రాచయ్యస్వామి, మాజీ అధ్యక్షుడు సంగమేశ్వర్, ఆలయ ధర్మకర్తలు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో శ్రీనివాస్మూర్తి సీడీసీ చైర్మన్కు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.