ఆర్కేపురం : ఈ నెల 11న రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి కోరారు. బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయ సేవా సదన్ భవనంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామరస్యంగా పరిష్కరించుకో తగ్గ కేసుల్లో రాజీ పడినటువంటి క్రిమినల్, సివిల్, వివాహ, కుటుంబ తగాదా కేసులు, మోటార్ వెయికిల్ యాక్సిడెంట్ కేసులు, చిట్ ఫండ్ కేసులతో పాటు ఇతర కేసులను పరిష్కరించుకోవాలని తెలిపారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండాలంటే రాజీ మార్గం ముఖ్యమని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.