ముషీరాబాద్ : కిన్నెర ఆర్ట్స్థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ రచయిత ఆచార్య ఆత్రేయ శతజయంతిని పురస్కరించు కొని ఆత్రేయ రంగస్థల పురస్కార ప్రదానోత్సవం గురువారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి.రమణాచారి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రముఖ నాటక రచయిత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్కు ఆత్రేయ రంగస్థల పురస్కారాన్ని అందచేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆత్రేయ ప్రత్యేక శైలి పాటలు, నాటకాల ద్వారా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించు కున్నారని, చక్కటి పాటలతో చాలా మంది తెలుగువారిని ఆకట్టుకున్న సుకవి, మనసు కవి ఆత్రేయ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎవికె ఫౌండేషన్ చైర్మన్ లయన్ విజయ్కుమార్, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం, సినీ నటుడు యు.సుబ్బరాయ శర్మ, గానసభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి, గాయకులు వైఎస్.రామకృష్ణ, సురేఖామూర్తి, ఎస్వి.రామారావు, ముద్దాళి రఘురామ్, లలిత తదితరులు పాల్గొన్నారు.