బంజారాహిల్స్ : హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వపరంగా అన్ని రకాలైన చర్యలు తీసుకుంటు న్నామని రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, ఐటీశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. దేశవ్యాప్తంగా 5లక్షలకు పైగా రెస్టారెంట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) హైదరాబాద్ చాఫ్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం బంజారాహిల్స్లోని హయత్ ప్లేస్ హోటల్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ..హైదరాబాద్ అంటేనే విభిన్నమైన వంటకాలతో జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పొందిందన్నారు. హైదరాబాద్లోని ఆహార సంస్కృతి, సంప్రదాయాలకు సంబందించి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నారు.
ఆహార రంగంలో ఇంతటి గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరంలో జాతీయస్థాయి సంస్థ తన చాఫ్టర్ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా సేవలు అందిస్తున్న రెస్టారెంట్స్లో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారని, ఈ రంగంలో సుమారు రూ.6వేల కోట్లకు పైగా వ్యాపారం ఉందన్నారు.
రానున్న కాలంలో మరింతమందికి ఈ రంగంలో ఉపాధి లభించేలా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఏఐ ప్రెసిడెంట్ కబీర్ సూరి, హైదరాబాద్ చాఫ్టర్ హెడ్ శంకర్ కృష్ణమూర్తి, కో హెడ్ సంపత్ తుమ్మల, సాగర్ దర్యానీ, ప్రకుల్ కుమార్ , షాజ్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.