దినదినాభివృద్ధి చెందుతున్న పినపాక నియోజకవర్గానికి మణుగూరు కేంద్ర బిందువుగా ఉంది. దీంతో ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి. దీన్ని అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. కొందరు స్థానికులు నకిలీ పత్రాలు సృష్టించి ఇతర ప్రాంతాల వారికి భూములు విక్రయిస్తున్నారు. ఆయా భూముల పూర్వాపరాలు తెలిసిన అనంతరం బాధితులు లబోదిబోమంటున్నారు.
మణుగూరు రూరల్, జనవరి 21 : మణుగూరు పట్టణం, పరిసర ప్రాంతాల్లో బీటీపీఎస్, సింగరేణితోపాటు ప్రత్యక్ష, పరోక్షంగా ఉన్న కంపెనీలున్నాయి. దీంతో మణుగూరులోని భూములకు డిమాండ్ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు ప్రభుత్వ భూములను కబ్జా చేసి విక్రయించడంతోపాటు పలువురు నిర్మాణాలు చేపట్టారు. కొనుగోలు చేసినవారు మరో మారు విక్రయించేందుకు ప్రయత్నించగా.. హద్దులు ఏర్పాటు చేసే క్రమంలో స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం, పల్లె పార్కులకు పంచాయతీల్లో స్థలాలు కరువయ్యాయి. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమి చూపుతుండగా.. క్షేత్రస్థాయిలో అది ఆక్రమణకు గురైంది. ఈ విషయం గుర్తించిన రెవెన్యూ అధికారులు ఇటీవల ఆయా భూముల్లోని అక్ర మ నిర్మాణాలను తొలిగించడంతో సమితిసింగా రం పంచాయతీలోని ప్రభుత్వ భూమిలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పనులను నిలిపివేశారు.
16 ఎకరాలు స్వాధీనం..
మణుగూరు మండలం ముత్యాలమ్మనగర్ పంచాయతీలోని ఐటీఐ కళాశాల వెనుక భాగంలో ఉన్న 314 సర్వేనంబర్లో దాదాపు 11 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. వివిధ ప్రాంతాల్లోని వ్యక్తులకు విక్రయించగా.. వారు గదులు నిర్మించుకున్నారు. అంతేకాకుండా, కబ్జాదారులు నకిలీ కాగితాల పేరిట ఒక ప్లాట్ను మరొకరికి విక్రయించగా.. తీవ్ర వివాదాస్పదమై పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మణుగూరు తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాదాపు 11 ఎకరాల స్థలంలో అక్రమంగా నిర్మించిన 23 కట్టడాలను కూల్చివేసి చుట్టూ ఏర్పాటు చేసిన పెన్సింగ్ను తొలగించారు. బీటీపీఎస్ రైల్వేట్రాక్లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు అక్కడ నివాస గృహాలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ అనుదీప్ ఇండ్ల నిర్మాణంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. సమితిసింగారం పంచాయతీ ఉడతానిగుంపు సమీపంలోని 138 సర్వే నంబరులో రోడ్డుకు పక్కనే 5 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉండగా.. ఆ స్థలం కబ్జాకు గురికావడంతోపాటు స్థలం విక్రయించారు. అదే ప్రాంతంలో వృద్ధాశ్రమం పేరిట ఓ ఇంటి నిర్మా ణం చేపట్టారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలమని బోర్డు ఏర్పాటు చేశారు. ఆ ఇంటి నిర్మాణం నిలిపివేసి సామగ్రిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.
ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తాం
కలెక్టర్ ఆదేశాల మేరకు ముత్యాలమ్మనగర్ పంచాయతీలోని 13 ఎకరాల భూమిని బీటీపీఎస్కు అప్పగించాం. నిర్మాణాలు చేసినా, ఆక్రమించినా కూల్చివేస్తాం. ఉడతానిగుంపులోని ఓ ఇంటి నిర్మాణం నిలిపివేశాం. ఆ భూములను పంచాయతీలో ప్రకృతివనం ఏర్పాటుకు కేటాయించడంతోపాటు ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తాం.
-తహసీల్దార్ చంద్రశేఖర్