వ్యవసాయ యూనివర్సిటీ : సీఆర్పీఎఫ్ జవాన్లు చేపట్టిన సైకిల్ ర్యాలీకీ అపూర్వ స్పందన లభించింది. ఆజాదీకా అమృతోత్సవ్ పేర ప్రజలను జాగృతం చేసే ఉద్ధేశంతో కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఈ ర్యాలీని చేపట్టింది. ఆగస్టు 22న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బుధవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్దకు చేరుకుంది.
ఏజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సుధీర్కుమార్, సీఆర్ పీఎఫ్ తెలుగు రాష్ట్రాల డీజీపీ ఎ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలికారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక తదితర 20 రాష్ట్రాలకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు కుల,మతాలకు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారని ఇంచార్జీ రమేష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బెంగళూర్ పార్లమెంట్ సభ్యులు తేజస్విసూర్య పాల్గొని వారికి అభినందనలు తెలిపారు. అక్టోబర్ 2న ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద ఈ ర్యాలీ ముగుస్తుందన్నారు. ముగింపు కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హజరుకానున్నారన్నారు. కార్యక్రమంలో సీఆర్ పీఎఫ్ అధికారులు ,పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొని వారికి అభినందనలు తెలిపారు