సికింద్రాబాద్ : ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలకు సేవ చేయడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు ఆదివారం వరల్డ్ డయాబెటిక్ డేను పురస్కరించుకొని కార్కానా లోని ఏ.జి సెంటర్ ఫర్ డయాబెటిక్ థైరాయిడ్, ఎండోక్రైన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ వైద్య పరీక్షలను ఓల్డ్ వాసవి నగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే సాయన్నతో పాటు అడిషనల్ డీసీపీ పరవస్తు మధుకర్స్వామిలు ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలను చేయించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ ఏ.జి. సెంటర్ ఫర్ డయాబెటిక్ ఆస్పత్రి, ఐక్యూ హాస్పిటల్ , జార్జ్ డయాగ్నోస్టిక్స్ ఆస్పత్రి సంయుక్తంగా వైద్య పరీక్షలను నిర్వహించి, పేదలకు సేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో కంటోన్మెంట్ ప్రజలు తరలివచ్చి వైద్య పరీక్షలను నిర్వహించుకున్నారు.
సుమారు నాలుగు వేల ఐదు వందల రూపాయల వైద్య పరీక్షలను ఉచితంగా సుమారు 450 నిర్వహించడం జరిగిందని డాక్టర్ అమిత్ గోయల్ తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు నివేదితా, టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి గోపాల్, పనస సంతోష్, సదానంద్ గౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.