సికింద్రాబాద్ : మహిళల అభిరుచికి అనుగుణంగా బతుకమ్మ చీరెల ఉన్నాయని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ అన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్ కమ్యూనిటీ హాల్లో సోమవారం జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యాక్రమంలో స్థానిక కార్పొరేటర్ కంది శైలజతో కలిసి ఆమె సందర్శించి చీరలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది సరికొత్త డిజైన్లతో తయారు చేసిన బతుకమ్మ చీరెల పట్ల మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆహారభద్రత కార్డుల్లోని డాటా ఆధారంగా మహిళలందరికీ సరిపోయేలా చీరలు సిద్ధం చేశామని తెలిపారు.
బతుకమ్మ చీరలు నాణ్యతతో పాటు ఎంతో మన్నికగా ఉన్నాయని చెప్పారు. ప్రతి ఆడబిడ్డా దసరా పండుగ రోజున కొత్త దుస్తులు కట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రత్యేకంగా చీరెలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండుగ
బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి చిహ్నంగా నిలుస్తుందని సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ అన్నారు. సోమవారం డివిజన్లోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో చీరెల పంపిణీ కేంద్రాన్ని ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజల అతి పెద్ద పండుగ అయిన దసరా సందర్భంగా జరుపుకునే ‘బతుకమ్మ’ను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని స్పష్టం చేశారు. ఆడబిడ్డలకు ఎంతో ప్రాధాన్యం కలిగిన బతుకమ్మ సందర్భంగా చీరెలను సారెగా అందజేయడం సంతోషంగా ఉందన్నారు.