సంగారెడ్డి, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి మెడికల్ కళాశాల ప్రారంభం దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వైద్య కళాశాల తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా అతి ముఖ్యమైన ప్రిన్సిపాల్ పోస్టును భర్తీ చేసింది. ప్రిన్సిపాల్గా వరంగల్ కాకతీయ మెడికల్ వైద్య కళాశాల (కేఎంసీ)లో ప్రొఫెసర్గా పని చేస్తున్న డాక్టర్ వాణిని నియమించింది. ఆమె త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ మేరకు సంగారెడ్డి జిల్లాకు వైద్యకళాశాలను మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇటీవలే ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వైద్యకళాశాల భవనాల నిర్మాణం, సిబ్బంది నియామకం తదితర అంశాలపై కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య కళాశాల తరగతి గదులు నిర్వహించే భవనం పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఇటీవల కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షిషా కళాశాల భవన పనులను పరిశీలించి, నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. దీంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది జూలై నుంచి వైద్య కళాశాల తరగతులు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్, పరిపాలన ఇతర సిబ్బంది నియామకాలు చేపడుతున్నది. సంగారెడ్డి వైద్య కళాశాలను 150 సీట్లతో ప్రారంభించనున్నారు. ఇందుకోసం సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర దవాఖానలో 500 పడకలతో కొత్త దవాఖానను నిర్మించనున్నారు. వైద్యకళాశాల తరగతుల నిర్వహణకు డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట భవనాలను నిర్మిస్తున్నారు. డీఎంహెచ్వో కార్యాలయం భవనాన్ని వైద్య కళాశాల అడ్మినిస్ట్రేషన్ భవనంగా మార్చారు. డీఎంహెచ్వో కార్యాలయాన్ని వేరే చోటుకు తరలించారు. వైద్య కళాశాలలో 15కు పైగా డిపార్టుమెంట్లు ఉండనున్నాయి. ఆయా డిపార్టుమెంట్ల వారీగా ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, హెచ్వోడీలు మొత్తం 150 మందికిపైగా సిబ్బందిని ప్రభుత్వం నియమించింది.
ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు విధుల్లో చేరుతున్నారు. ఇటీవల హైదరాబాద్లోని గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ ప్రకాశ్రావు సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ప్రిన్సిపాల్ పోస్టును భర్తీ చేయగా, వైద్య కళాశాల ఏర్పాటు పనులు మరింత ఊపందుకోనున్నాయి. సంగారెడ్డి వైద్య కళాశాలలో చేరే విద్యార్థుల కోసం హాస్టళ్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. సంగారెడ్డిలోని గిరిజన సంక్షేమశాఖ శిక్షణ కేంద్రం భవనం, డీఎంహెచ్వో భవనంలో విద్యార్థులు (గర్ల్స్, బాయ్స్)కు వేర్వేరుగా హాస్టల్ గదులను ఏర్పాటు చేస్తున్నారు.