బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్లో నట్రాజ్నగర్-బోరబండ రోడ్డు విస్తరణ పను లను తక్షణమే చేపట్టాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో సోమవారం జీరో అవర్ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నట్రాజ్నగర్ రోడ్డు విస్తరణ అంశాన్ని లేవనెత్తారు. ఈఎస్ఐ నుంచి ఏజీకాలనీ, నట్రాజ్నగర్ మీదుగా బోరబండకు వెళ్లే రహదారిని 100 ఫీట్ల మేర విస్తరించాలని కోరారు.
సుమారు 20ఏండ్లుగా ఈ రోడ్డు విస్తరణ పనులు ముందుకు సాగకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈఎస్ఐ నుంచి హైటెక్ సిటీకి లింక్ రోడ్డుగా ఉన్న ఈ రోడ్డును అభివృద్ది చేయడం ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఇప్పటికే రోడ్డు విస్తరణ కోసం ఇండ్లు కోల్పోతున్న వారికి సంబంధించిన వివరాలు గుర్తించ డం జరిగిందని, తక్షణమే రోడ్డు విస్తరణకు అనుమతులు ఇచ్చి పనులు ప్రారంబించాలని కోరారు.
త్వరలోనే ఎర్రగడ్డ చాతీ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేయనున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినందున భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నట్రాజ్నగర్ రోడ్డు విస్తరణ చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లేవనెత్తిన అంశాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమాధానం ఇచ్చారు.