రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 4 : సాంకేతిక కారణాలతో నిషేధిత జాబితాలో చేరిన పట్టా భూములను సీఎం కేసీఆర్ ఆదేశాలతో క్లియర్ చేస్తున్నారు. వారం రోజుల నుంచి రంగారెడ్డి జిల్లాలో ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రస్తుతం పట్టాదారు దరఖాస్తు చేసుకున్నా.. చేసుకోకపోయినా పట్టా భూములన్నింటినీ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నారు. ధరణి పోర్టల్లో వచ్చే మ్యుటేషన్, సక్సేషన్స్ ఇతర దరఖాస్తులను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరిస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూముల వివరాలను జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే సేకరించింది. ఈ వివరాల ప్రకారం నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములను మండలాల వారీగా తొలగిస్తున్నారు. ఈ ప్రక్రియ జిల్లాలోని ఫరూఖ్నగర్, కొత్తూరు, నందిగామ, కేశంపేట, చౌదరిగూడెం, కడ్తాల్, కొందుర్గు, తలకొండపల్లి, ఆమనగల్లు, మంచాల, యాచారం మండలాల్లో ఇప్పటికే పూర్తి చేశారు. వారంలోగా మిగతా మండలాల్లోని నిషేధిత భూములను తొలగించనున్నారు.
రైతులకు శుభవార్త. సాంకేతిక కారణాలతో నిషేధిత జాబితాలో చేరిన భూములను క్లియర్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిషేధిత జాబితాలో చేరిన పట్టా భూములన్నింటినీ ఆ జాబితా నుంచి తొలగిస్తున్నారు. గత వారం రోజుల నుంచి జిల్లాలో నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే సాంకేతిక కారణాలతో ఒక సర్వే నెంబర్లో ఒక్క ఎకరం కోర్టు కేసులో ఉన్నా.. సర్వే నెంబర్లోని మొత్తం భూమి నిషేధిత జాబితాలో చేరిపోయింది. దీంతో ధరణి పోర్టల్ ద్వారా నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే సంబంధిత మండల తహసీల్దార్ నిషేధిత జాబితాలో లేదని రిపోర్ట్ ఇచ్చినట్లయితే.. ఆర్డీవో, డీఆర్వో, జేసీ, చివరకు కలెక్టర్ డిజిటల్ సంతకంతో నిషేధిత జాబితా నుంచి తొలగిపోయేది. అయితే ప్రస్తుతం పట్టాదారు దరఖాస్తు చేసుకున్నా.. చేసుకోకపోయినా పట్టా భూములన్నింటినీ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నారు. నిషేధిత భూములు కాకపోయినప్పటికీ సాంకేతిక కారణాలతోనే నిషేధిత భూముల జాబితాలో ఉన్న దృష్ట్యా నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించేందుకు ప్రభుత్వం ఆదేశించింది. ధరణి పోర్టల్ ద్వారా వచ్చే మ్యుటేషన్స్, సక్సేషన్స్ ఇతర దరఖాస్తులన్నింటినీ జిల్లా రెవెన్యూ యంత్రాంగం సత్వరమే పరిష్కరిస్తున్నది.
11 మండలాల్లో ప్రక్రియ పూర్తి
సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములన్నింటినీ నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. జిల్లాలోని ఆయా మండలాల్లో నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూముల వివరాలను జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే సేకరించింది. ఈ వివరాల ప్రకారం నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములను మండలాలవారీగా తొలగిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 11 మండలాలకు సంబంధించి నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములను తొలగించే ప్రక్రియ పూర్తి చేశారు. ఫరూఖ్నగర్, కొత్తూరు, నందిగామ, కేశంపేట, చౌదరిగూడెం, కడ్తాల్, కొందుర్గు, తలకొండపల్లి, ఆమనగల్లు, మంచాల, యాచారం మండలాల్లో నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములన్నింటినీ నిషేధిత జాబితా నుంచి తొలగించారు. మరో వారం రోజుల్లో జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రొహిబిటెడ్ జాబితాలో చేరిన పట్టా భూములన్నింటినీ ఆ జాబితా నుంచి తొలగించే ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టింది. అదేవిధంగా మిగతా మండలాలకు సంబంధించి.. మొయినాబాద్ మండలంలో 4 గ్రామాలు, షాబాద్లో 7 గ్రామాలు, ఇబ్రహీంపట్నంలో 7 గ్రామాలు, కందుకూరు మండలంలో రెండు గ్రామాల్లోని పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు నిషేధిత జాబితాలో ఉన్న 210 గ్రామాల్లోని పట్టా భూములను జిల్లా రెవెన్యూ యంత్రాంగం క్లియర్ చేసింది. అదేవిధంగా గతంలో మాదిరిగా దరఖాస్తు చేసుకున్న సర్వే నెంబర్లే కాకుండా దరఖాస్తు చేసుకోకపోయినప్పటికీ నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములన్నింటినీ తొలగిస్తున్నారు. ఇందుకుగాను గత వారం రోజులుగా రోజుకు కొన్ని మండలాల తహసీల్దార్లతోపాటు సంబంధిత డివిజన్ ఆర్డీవో కూడా కలెక్టరేట్లో ప్రత్యేకంగా సమావేశమై నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములను తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు.
సత్వరమే ధరణి దరఖాస్తుల పరిష్కారం
రాష్ట్రంలోనే అత్యధిక దరఖాస్తులు వచ్చే రంగారెడ్డి జిల్లాలో ఎప్పటికప్పుడు జిల్లా రెవెన్యూ యంత్రాంగం పరిష్కరిస్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన ధరణి దరఖాస్తుల్లో 98 శాతం దరఖాస్తులను పరిష్కరించారు. ప్రతి రోజూ రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, జిల్లా పాలన వ్యవహారాల్లో బిజీగా ఉన్నప్పటికీ ధరణి దరఖాస్తులకు సంబంధించి ఒక్కటి కూడా పెండింగ్లో ఉండకుండా చూస్తున్నారు. ఏ ఒక్క ఫైల్ కూడా పెండింగ్లో ఉండకుండా చూస్తున్నారు. మ్యుటేషన్స్, సక్సేషన్కు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆమోదం తెలుపుతున్నది. ప్రతి రోజూ 600 దరఖాస్తుల వరకు క్లియర్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ధరణి పోర్టల్కు సుమారు 85 వేల దరఖాస్తులురాగా, ఇప్పటివరకు 80 వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించారు. దరఖాస్తులను పరిష్కరించినవాటిలో మ్యుటేషన్-29వేల దరఖాస్తులు, ఆర్గనైజేషన్ పీపీబీ-559, ఆధార్ సీడింగ్-2978, ఎన్ఆర్ఐ-167, గ్రీవెన్స్ ఆన్ ల్యాండ్ మ్యాటర్స్-18979, జీపీఏ-3625, నిషేధిత జాబితా-8321, పీపీబీ లేకుండా సక్సేషన్-1779, కోర్టు కేసుల ద్వారా పీపీబీ-546, పాస్బుక్ లేకుండా నాలా-159, అక్వైర్డ్ ల్యాండ్స్-1737, కోర్టు కేసు, ఇంటిమేషన్-6066, అన్లాక్ పీపీబీ ఆఫ్ పీపీ-584 దరఖాస్తులను ఇప్పటివరకు పరిష్కరించారు.
ఇప్పటివరకు 11 మండలాల్లో పూర్తి