సంస్థాన్ నారాయణపురం, డిసెంబర్ 15 : మండల కేంద్రానికి చెందిన నలుగురు వృద్ధుల పింఛన్ పునరుద్ధరించారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన ‘బతికుండగానే చంపేశారు’ కథనానికి అధికారులు స్పందించారు. మండల కేంద్రానికి చెందిన వృద్ధులు ఉప్పల పాపమ్మ, రమావత్ గోమ్లీ, జక్కిడి ప్రతాప్రెడ్డి, జక్కిడి వెంకట్రెడ్డి పింఛన్పైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీళ్లు చనిపోయినట్లు గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయ అధికారులు రికార్డుల్లో నమోదు చేయడంతో పింఛన్ రద్దయ్యింది. దాంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ‘నమస్తే తెలంగాణ’ అక్టోబర్ నెలలో ‘బతికుండగానే చంపేశారు’ కథనం ప్రచురించింది. డీఆర్డీఓ ఉపేందర్రెడ్డి స్పందించి ఏపీఓ లలితాదేవిని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓ నిర్లక్ష్యంగా వ్యవహరించి వృద్ధులు చనిపోయినట్లుగా రికార్డుల్లో నమోదు చేశారని ఉన్నతాధికారులకు ఆమె నివేదిక అందించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ కార్యదర్శి భరత్, ఎంపీఓ శశికళను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత అధికారులు జరిగిన పొరపాటును సవరించి మూడు నెలల తర్వాత నలుగురు వృద్ధుల పింఛన్ను పునరుద్ధరించారు. మేళ్లచెరువు తండాకు చెందిన రమావత్ గోమ్లీ ఆరోగ్యం క్షీణించి మంచానికి పరిమితం కావడంతో ఏబీపీఎం రామస్వామి ఆమె ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ అందించారు. నాలుగు నెలలుగా పింఛన్ రాకపోవడంతో మందులు, తినడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డామని, పింఛన్ ఇప్పించేందుకు సాయం చేసిన నమస్తే తెలంగాణ పత్రిక, అధికారులకు వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు.
రుణపడి ఉంట
కండ్లు కనిపిస్తలేవు. బీపీ ఎక్కువైంది. పెద్దసార్లు నేను సచ్చిపోయిన అని రాసి పింఛన్ కొట్టేయడంతో నాలుగు నెలల సంది పింఛన్ వస్తలేదు. మందులకు, తిండికి చానా ఇబ్బంది పడుతున్న. పేపర్ల రాస్తే పెద్ద సార్లు చూసి మళ్ల ఈ నెల సంది పింఛన్ ఇస్తున్నరు. పింఛన్ పైసలతోనే బతుకుతున్న. సాయం చేసిన పేపరోళ్లకు, పెద్ద సార్లకు రుణపడి ఉంటా.