మెదక్, డిసెంబర్ 8: ఉమ్మడి మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్ సెక్టోరల్ అధికారులకు బుధవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం తెలపాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి రెండు బ్యాలట్ బాక్సులు ఇస్తున్నామని, పోలింగ్ ప్రారంభానికి ముందు, పోలింగ్ పూర్తయిన తర్వాత ఏజెంట్ల సమక్షంలో బ్యాలట్ బాక్సు తెరవడం, క్లోజ్ చేయడం చేయాలన్నారు. బ్యాలట్ పేపర్ పద్ధతిలో జరిగే ఈ పోలింగ్లో ఓటర్లకు ఇండెబుల్ ఇంకు వేలుకు రాయరని, ఓటర్లు ఎన్నికల అధికారులు ఇచ్చే వయొలెట్ కలర్ పెన్తోనే ప్రాధాన్యతా క్రమంలో అంకెల రూపంలో రాయాలని తెలిపారు. రిసెప్షన్ కేంద్రం నుంచి ఎన్నికల సామగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం సరిగ్గా చూసుకోవాలని, రిసెప్షన్ కేంద్రం నుంచి బయలుదేరిన తర్వాత ఎక్కడా ఆగకుండా కేంద్రానికి వెళ్లాలన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత నేరుగా రిసెప్షన్ కౌంటర్కు వచ్చి అప్పగించాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు అనుకూలంగా సీటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని, కేంద్రంలో అవసరమైన మేరకు షామియానాలు, తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, విద్యుత్, ర్యాంప్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా వాతావరణం కల్పించాలన్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంటుంది కాబట్టి జాగ్రత్తతో పనిచేయాలని, ఏమైనా ఇబ్బందులుంటే తక్షణమే అధికారులకు తెలుపాలని అధికారులకు సూచించారు.