భువనగిరి అర్బన్, డిసెంబర్ 20 : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఓపెన్ స్టేడియం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని స్థలాన్ని ఇప్పటికే అధికారులు సర్వే చేశారు. అధునాతన వసతులతో అన్ని మౌలిక సౌకర్యాలతో స్టేడియం ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన క్రీడా మైదానం, ఉదయం ప్రజలు వాకింగ్ చేయడానికి స్థలం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఏండ్లుగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, భువనగిరి ప్రధాన రహదారి వెంట ఉన్న ఖాళీ స్థలాలను క్రీడాకారులు వినియోగించుకుంటున్నారు. భువనగిరి పట్టణాన్ని అన్నివిధాలా తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి క్రీడాకారుల ఇబ్బందులను సైతం తీర్చేందుకు ఓపెన్ స్టేడియం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వెంటనే అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. స్టేడియం ప్రతిపాదిత స్థలంలో సోమవారం బోరు డ్రిల్లింగ్ పనులను ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ప్రారంభించారు.
12 ఎకరాల స్థలం సర్వే..
ఓపెన్ స్టేడియం ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ 12 ఎకరాలు ఉంది. ఎకరంలో ఇంటర్మీడియట్ కళాశాల, మరో ఎకరంలో ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ పాఠశాల కొనసాగుతున్నది. ముందు, వెనుకభాగంలో స్థలం నిరుపయోగంగా ఉండడంతో ఆపరిశుభ్రంగా మారుతున్నది. దాంతో ఈ స్థలాన్ని ఓపెన్ స్టేడియం ఏర్పాటుకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. స్టేడియం ఏర్పాటుకు అవసరమయ్యే స్థలాన్ని మంగళవారం నుంచి అధికారులు సర్వే చేయనున్నారు. స్టేడియం ఏర్పాటు దాదాపు రూ.2.5 కోట్లకుపైగా వ్యయం అవుతున్నదని అంచనా వేస్తున్నారు. స్థలం సర్వే పూర్తికాగానే స్టేడియం ఏర్పాటు బాధ్యతలను ఆర్కిటెక్ట్ సంస్థకు అప్పగించనున్నారు. కళాశాల ముందుభాగంలోని ప్రధాన రహదారి వెంట షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయితే కళాశాలకు, ఓపెన్ స్టేడియానికి మరింత కళ రానుంది.
క్రీడాకారులను ప్రోత్సహించేందుకే
క్రీడాకారులను ప్రోత్సహించేందుకే జిల్లా కేంద్రంలో ఓపెన్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నాం. పట్టణం నడిబొడ్డులో నిరుపయోగంగా ఉన్న స్థలంలో స్టేడియం ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ప్రాంత క్రీడాకారులను అన్నివిధాలా ప్రోత్సహిస్తాం. క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలి.
సర్వే అనంతరం మరింత స్పష్టత
స్టేడియం ఏర్పాటు ప్రతిపాదిత స్థలాన్ని నేటి నుంచి సర్వే చేస్తాం. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సోమవారం స్థలాన్ని పరిశీలించారు. సర్వే అనంతరం ఎన్ని ఎకరాల్లో స్టేడియం ఏర్పాటు చేయాలనేది నిర్ణయిస్తాం. ప్రధాన రహదారి ముందు షాపింగ్ కాంప్లెక్స్, క్రీడాస్థలం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.