పహాడీషరీఫ్ : జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసేందుకు శనివారం రానున్నట్లు చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ జీపీ. కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా పహాడీషరీఫ్లోని ప్రధాన రహదారులు, సమావేశం ఏర్పాటు చేసే స్థలంలో క్లీనింగ్ పనులు, స్థలాన్ని చదును చేసే పనులను వారు గురువారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి కలిసి బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.166.64 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారు.
అలాగే మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.59.19 కోట్లతో, జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.111.76 కోట్లతో, తుక్కుగూడ మున్సిపల్ పరిధిలో రూ.33.50 కోట్లతో మంచి నీటి పైపులైన్, రిజర్వాయర్లు, బీటీ, సీసీ రోడ్లు, రహదారుల వెడల్పు, చెరువులు, నాలాల అభివృద్ధి, వెజ్, నాన్వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు వంటి తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.