ఖైరతాబాద్ : ‘బయటే కాదు…ఇంట్లోనూ చిన్నారులపై లైంగిక వేదింపులు, దాడులు జరుగుతున్నాయి….సొంత వారే ఆ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు…ఇది సున్నితమైన విషయం….జాగ్రత్తగా అవగాహన కల్పించాలి….స్వచ్ఛంధ సంస్థలు, సెలబ్రిటీలను భాగస్వాములను చేయాలి’ అని ప్రముఖ సినీ దర్శకులు శేఖర్ కమ్ముల అన్నారు.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పిల్లల భద్రత కోసం ప్రతిజ్ఞ’ కార్యక్రమాన్ని ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన శేఖర్ కమ్ముల ఆన్లైన్తో పాటు ప్రతిజ్ఞతో కూడిన బ్రోచర్లను ఫౌండేషన్ కో ఫౌండర్ కౌముది నాగరాజు, ప్రొగ్రాం డైరెక్టర్లు నళిని, శ్రీదేవి, ఆంకాలజిస్ట్ మల్లిక్ సింగరాజుతో కలిసి ఆవిష్కరించారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ఫౌండేషన్ వారు చేస్తున్నది చిన్న ప్రయత్నం కాదని, పెద్ద సంకల్పమని, ప్రభుత్వ భాగస్వామ్యంతో కలిసి పనిచేయాలని కోరారు. దారిద్య్రరేఖకు దిగువనున్న వారితో పాటు అన్ని వర్గాలలో ఈ సమస్య కనిపిస్తుందని, సొంతవారే అలా చేస్తే చెప్పుకోలేని పరిస్థితి ఉంటుందని, అలాంటి తరుణంలో పిల్లలకు అర్థమయ్యే రీతిలో స్కిట్లు, నాటికలు, ప్రదర్శనల ద్వారా అవగహన కల్పించాలన్నారు.
తాను దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ చిత్రంలోనూ ఇదే కథాంశాన్ని తీసుకున్నానన్నారు. రచయితలు, సాంకేతికవర్గం చాలా కష్టపడ్డారని, ఈ సబ్జెక్టు ప్రజల్లోకి విశేషంగా వెళ్లిందని, తన సినిమాకు సార్థకత లబించిందన్నారు. కౌముది నాగరాజు మాట్లాడుతూ 2014లో లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ సంస్థను స్థాపించామని, నాటి నుంచి పిల్లలపై జరిగే లైంగిక వేదింపులపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.
ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల కోసం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 8వేలకు పైగా పిల్లలకు అవగాహన కల్పించామన్నారు తమ కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలన్న ఉద్దేశ్యంతో ఆన్లైన్ (https://pledge.learningspace.co.in)లో ప్రతిజ్ఞా చేసే ప్రక్రియను ప్రారంభించామన్నారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ ప్రతిజ్ఞ చేయాలని, తమకు తెలిసిన వారితో చేయించాలన్నారు. తాము రూపొందించిన బ్రోచర్లను ఆర్టీసీ బస్సులలో, బస్టాండ్లో ఏర్పాటు చేసేందుకు ఎండీ సజ్జనార్ విశేషంగా కృషి చేశారని, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.