ఏడు ప్రభుత్వదవాఖానల్లో నైట్షెల్టర్లు
రోగులు, వారి సహాయకులకు సదుపాయాలు
900 మంది ఉండేలా షెల్టర్లలో వసతులు
చలి, వాన బాధలు ఇక ఉండవు
రూ.10.68కోట్లతో షెల్టర్లు అందుబాటులోకి..
జీహెచ్ఎంసీ నిధులతో నిర్మాణం
సిటీబ్యూరో, నవంబరు 27(నమస్తే తెలంగాణ): దీర్ఘకాలిక రోగాలు, అత్యవసర సమయాల్లో వైద్యం కోసం నగరంలోనిప్రభుత్వ దవాఖానలకు నిత్యం వేలాదిమంది వస్తుంటారు. జబ్బు నయమయ్యే వరకు ఆస్పత్రుల్లోనే ఉంటారు. వీరికి సపర్యలు చేసేందుకే వెంట వచ్చే సహాయకులు లాడ్జీల్లో ఉండే స్థోమత లేక దవాఖానల ఆరుబయటే సేద తీరుతుంటారు.ఇలాంటి వారి కోసం మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)రూ.10.68 కోట్లతో ఏడు ప్రధాన ప్రభుత్వ దవాఖానల్లో నైట్షెల్టర్లను నిర్మించింది. అన్నివసతులతో నిర్మించిన వీటిని ఇప్పటికే ఆస్పత్రుల అభివృద్ధి కమిటీలకు అప్పగించారు. షెల్టర్లు అందుబాటులోకి రావడంతో వాన, చలి బాధలు పోయాయి.
మహా నగరం ఎంతో మంది వెతలు తీర్చి నీడనిచ్చి, అక్కున చేర్చుకునే ఒక అద్భుత క్షేత్రం. ఇక్కడికి ప్రాణాపాయం… దీర్ఘకాలికంగా వేధిస్తున్న రోగం… ఇలాంటి కష్ట కాలంలో రాష్ట్ర నలుమూలల నుంచి నగరంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న సామాన్య రోగులు, వారి సహాయకులు వసతి కోసం పడుతున్న వెతలు వర్ణనాతీతం. ఆస్పత్రిలో చేరితే సరి. కాని, కొన్ని సందర్భాల్లో వైద్య పరీక్షల ఫలితాలు వచ్చేంత వరకు రోగులు రోజుల తరబడి ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ రోగి ఆస్పత్రిలో చేరినట్లయితే వారికి సహాయంగా కనీసంగా ఒకరిద్దరు సహాయకులు కూడా అనివార్యం. ఈ క్రమంలో వారంతా రాత్రివేళల్లో బస చేసేందుకు ఇప్పటి దాకా వసతులు అంతంత మాత్రమే. లాడ్జీల్లో ఉండే ఆర్థిక స్థోమత లేక వీరంతా ఫుట్పాత్లపై చలికి వణుకుతూ నానా అవస్థలు పడుతున్నారు. అందుకే, తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించింది. గతంలో ఏ ప్రభుత్వానికీ రాని ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చింది. మనసున్న సర్కారుగా మరోసారి నిరూపించుకుంది. నగరంలో ఏడు ప్రధాన ఆస్పత్రుల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నైట్ షెల్టర్లు నిత్యం వందలాది మంది రోగులు, వారి సహాయకులను అక్కున చేర్చుకుంటున్నాయి.
నైట్ షెల్టర్ల నిర్మాణం..
నగరంలోని ప్రధానమైన ఏడు ఆస్పత్రుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూ.10.68 కోట్లతో ఈ నైట్ షెల్టర్ల నిర్మాణాన్ని చేపట్టింది. వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్లోని ప్రధాన ఆస్పత్రులకు చికిత్స కోసం వచ్చే వారు రాష్ట్ర నలుమూలల నుంచి ఆర్థిక స్థోమతలేక నిరుపేదలు నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తారు. రోజుకు వేలాది మంది ఇలా వస్తుంటారు. చికిత్స కోసం వచ్చే రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో నైట్ షెల్టర్లు ఏర్పాటు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు చికిత్స కోసం వచ్చే వారికి జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.