సికింద్రాబాద్ : జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కైవసం చేసుకుంది. పరిశుద్ధత, పచ్చదనం, చెత్త సేకరణ, మరెన్నో పర్యావరణ సంబంధ విషయాల్లో కంటోన్మెంట్ బోర్డుకు మంచి గుర్తింపు ఉంది. తాజాగా జాతీయస్థాయిలో చెత్త రహిత పట్టణ విభాగంలో స్వచ్ఛ సర్వేక్షణ్-2021 అవార్డుకు ఎంపికైంది.
ఈ క్రమంలో శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో జరిగిన స్వచ్ఛ అమృత్ మహోత్సవ్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రెడ్డి అందుకున్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు ఎంపిక కావడానికి సేవాస్థాయి పురోగతి, నాణ్యమైన చెత్త సేకరణ, ప్రత్యేకంగా వాహనాల నిర్వహణ, పారిశుద్ధ్య పనితీరు, సర్టిఫికేషన్ విధానంతో పాటు పలు అంశాలలో తీసుకున్న నిర్ణయాల్లో ప్రజలు భాగస్వామ్యం కావడం, వారిని చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టడం, స్వచ్ఛ యాప్ ఉపయోగించడం వంటి అంశాలు కంటోన్మెంట్ అవార్డుకు ఎంపిక కావడంలో ప్రధానంగా ఉన్నాయి.
ఈ సందర్భంగా కంటోన్మెంట్కు అవార్డు రావడంపై కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందులో బోర్డు ప్రజల ఐక్యత, వారి భాగస్వామ్యం ప్రధాన పాత్ర పోషించాయని, అభివృద్ధి, అవార్డుల్లో వారు ఎంతో స్ఫూర్తిని చాటుతున్నారని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు దక్కడంపై బోర్డు ప్రజలకు అభినందనలు తెలిపారు.
బోర్డుకు అవార్డు రావడం అభినందనీయం
జాతీయస్థాయిలో కంటోన్మెంట్ బోర్డుకు స్వచ్ఛ సర్వేక్షణ్-2021 అవార్డు రావడం ఎంతో అభినందనీయం. ఈ అవార్డు రావడంలో బోర్డు పరిధిలోని ప్రజల భాగస్వామ్యం, ప్రజా ప్రతినిధుల చొరవ, అధికారుల అంకిత భావం తోడ్పడ్డాయి. ఇదే స్ఫూర్తితో కంటోన్మెంట్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలిపే విధంగా కృషి చేయాలన్నారు.
కంటోన్మెంట్కు అవార్డు రావడంతో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు సైతం బాధ్యత మరింత పెరిగింది. బోర్డు పరిధిలో ఉన్న వనరులతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలన్నారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి మరిన్ని అవార్డులు పొందే విధంగా ముందుకుసాగాలని సూచించారు.
– జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్ బోర్డు.