పచ్చి అబద్ధాలు.. రాష్ట్రంపై విషం చిమ్మే మాటలతో బీజేపీ నాయకులు నానాటికీ దిగజారిపోతున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు సైతం కాళేశ్వరం ప్రాజెక్టుపై దగాకోరు మాటలకు దిగి అభాసుపాలయ్యారు. ఆలేరు నియోజకవర్గంలో ఒకప్పుడు కరువుతో అలమటించిన గుండాల, బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాలు కాళేశ్వరం జలాలు ఏడాది కాలంలోనే అద్భుతాలు సృష్టిస్తున్నది ఇక్కడి యావత్ ప్రజానీకానికి తెలుసు. కాలంతో సంబంధం లేకుండా మత్తడి దుంకుతున్న చెరువులు.. కనుచూపు మేర పచ్చదనం పరుచుకుని సిరులు పండిస్తున్న భూములు.. ఇవేమీ నడ్డా కండ్లకు కనపడకపోవడాన్ని రైతాంగం జీర్ణించుకోలేకపోతున్నది. కాళేశ్వరం జలాల ద్వారా తమ బతుకులకు భరోసాను అందించిన రాష్ట్ర ప్రభుత్వంపై కక్షపూరితంగా మాట్లాడడంపై మండి పడుతున్నది. నడ్డా వ్యాఖ్యలు ఆయన అవగాహన లేమిని స్పష్టం చేస్తున్నాయని, చైతన్యానికి ప్రతీక అయిన తెలంగాణపై బీజేపీ నేతలు కుట్రలు మానుకోవాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మండిపడ్డారు.
యాదాద్రి భువనగిరి, జనవరి 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని గుండాల.. తుర్కపల్లి.. బొమ్మలరామారం.. నిన్న మొన్నటివరకు కరువుతో తల్లిడిల్లిన ప్రాంతాలవి. ఉరకలెత్తే నీటి ప్రవాహాలు లేక.. పంటలకు నీళ్లుండేవి కావు. జనం వరుస కరవులతో అల్లాడిపోయేవారు. ఈ పరిస్థితుల్లో కాళేశ్వర జలాలు ఆ మూడు మండలాల్లో పెను మార్పును తీసుకొచ్చాయి. కొండపోచమ్మ నుంచి దిగువకు జాలువారిన గోదావరి జలాలు పొలాలవైపు మళ్లగా.. బీడు భూముల్లో రత్నాల్లాంటి రాశులు పండుతున్నాయి. సీఎం కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నంతో ఎక్కడో పారుతున్న గోదారమ్మను.. కొండపోచమ్మ సాగర్ ద్వారా గత యేడాది జూన్లో ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో పారించి రైతాంగానికి కొత్త బతుకునిచ్చారు. అంతకు రెండేళ్ల క్రితమే దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నవాబ్పేట రిజర్వాయర్ నుంచి గుండాల మండలానికి గోదావరి జలాలను పారించారు. మండలంలో 90 వరకు ఉన్న చెరువులు అటు వర్షపునీటితో, ఇటు గోదావరి జలాలతో కళకళలాడుతున్నాయి. ఫలితంగా..ఈ మూడు మండలాల్లో మెట్ట, మాగాణి అన్న తేడా లేకుండా నేడు రైతులు బంగారు పంటలు పండించుకుంటున్నారు. ఒకప్పుడు దండుగలా మారిన ఎవుసానికి జీవం పోసిన గోదావరి జలాలను చూసి రైతు కుటుంబాలు సంతోషంతో గడుపుతున్నాయి.
రెండు పంటలకు పుష్కలంగా నీళ్లు
గోదావరి జలాల రాక మునుపు ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మలరామారం, తుర్కపల్లి, గుండాల మండలాల్లో వర్షాధార వ్యవసాయమే సాగేది. రైతులు చిరు, తృణ ధాన్యాలను మాత్రమే సాగు చేసేవారు. అరకొర దిగుబడులతో అష్టకష్టాలు పడేవారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంత పరిస్థితి మెరుగుపడింది. కొండపోచమ్మ జలాశయం నుంచి గోదావరి జలాల రాకతో ఇక్కడి పల్లెల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఒట్టిపోయిన చెరువులు నేడు గోదారి నీటితో చిందేస్తున్నాయి. కాల్వల ద్వారా వేల ఎకరాలకు నీళ్లందుతుండడంతో బీడు భూములకు సాగు కళ వచ్చింది. ఎటు చూసినా జలకళను సంతరించుకున్న చెరువులు, కాల్వలు.. పచ్చదనమే కనిపిస్తోంది. భూగర్భజలాలు పెరిగి బోర్లు సైతం పుష్కలంగా పంటలకు నీరందిస్తున్నాయి. ఫలితంగా.. పచ్చని పంటలతో పొలాలు కళకళలాడుతుండడంతో రైతు మోములో చిరునవ్వు వికసిస్తోంది. ఒకప్పటి తాగునీటి ఇబ్బందులను సైతం గోదావరమ్మ తీర్చింది. ఓ వైపు ఎండలు మండిపోతున్నా.. తుర్కపల్లి మండలం గోపాల్పూర్ గ్రామంలోని పోచమ్మ చెరువు, పొట్టోని కుంట, మల్లాయకుంట, నాగాయపల్లి చెరువు, చిన్న లక్ష్మాపూర్ గ్రామ పరిధిలోని దాపల చెరువు, నల్లకుంట, ఎర్రకుంట, మాదాపూర్ గ్రామ పరిధిలోని జగ్గయ్య చెరువు, కొత్త చెరువులు.. బొమ్మలరామారం మండలంలోని తిమ్మాపురం గ్రామంలోని గూడెం చెరువు, తిమ్మప్ప చెరువులు జలకళతో అబ్బురపరుస్తున్నాయి.
సాగుతోపాటు దిగుబడులూ పెరిగాయి
గోదావరి జలాలు వచ్చిన తర్వాత గుండాల, బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పొట్టచేతబట్టుకుని ఊరొదిలి వెళ్లి పోయిన రైతు కుటుంబాలు సొంతూళ్లకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాయి. ఉన్న ఊర్లోనే చేతినిండా పని దొరికిందని సంబరపడుతున్నారు. గోదావరి నీళ్లు రాక మునుపు కొద్ది మోతాదులోనే సాగయ్యే పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అలాగే రెండు సీజన్లలోనూ పంటల దిగుబడులు సైతం ఊహించని విధంగా వస్తున్నాయి. గత వానకాలంలో సాగు చేసిన పంటలు చేతికందగా..ఇప్పటికే చాలా గ్రామాల రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధరను పొంది సంతోషంతో ఉన్నారు. ప్రస్తుత యాసంగికి సైతం రైతాంగం సన్నద్దమవుతున్నది. ఏడాది పొడవునా నీటితో కళకళలాడుతున్న చెరువుల్లో మత్స్య సంపద సైతం గత ఏడాదిన్నర కాలంలో అపారంగా పెరిగింది. సంవత్సరం పొడవునా మత్స్యకార్మికులకు చేతినిండా ఉపాధి లభిస్తుండడంతో ఆయా కుటుంబాలు సైతం సంతోషంగా గడుపుతున్నాయి.
నడ్డా వ్యాఖ్యలు అవగాహనారాహిత్యం
కాళేశ్వరం ప్రాజెక్టుపై జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు అవగాహనారాహిత్యం. రాష్ట్ర బాహుబలి ప్రాజెక్టుపై వ్యాఖ్యలు చేసేముందు ఆలోచించి మాట్లాడాలి. తెలంగాణ జలధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టు యాదాద్రిభువనగిరి జిల్లాతోపాటు నల్లగొండ జిల్లాలోని పలు మండలాలు సస్యశ్యామలం కానున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం 14వ ప్యాకేజీలో కొండపోచమ్మ సాగర్ జలాశయంతో ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని చెరువులు నిండుకుండలా మారాయి. తుర్కపల్లిలో అదనంగా 1,500 ఎకరాలు, బొమ్మలరామారంలో అదనంగా 800 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మితమైన నవాబ్పేట జలాశయంతో గుండాల మండల వ్యాప్తంగా సుమారు 3,000 ఎకరాల భూమి సాగులోకి రావడంతో అక్కడి రైతులు ఆనందంతో వ్యవసాయం చేసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు స్థిరీకరణతో సూర్యాపేట జిల్లాతోపాటు తుంగతుర్తి నియోజకవర్గంలో లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందుతున్నాయి. దాంతోపాటు మల్లన్నసాగర్ జలాశయం 15, 16వ ప్యాకేజీలో భాగంగా నిర్మితమవుతున్న నృసింహస్వామి జలాశయంతో భువనగిరి, ఆలేరు నియోకజవర్గాలతోపాటు నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో సుమారు 1,59,331 ఎకరాల భూమి సాగులోకి రానున్నది.
ఇన్ని నీళ్లు చూస్తామని కలలో కూడా ఊహించలేదు
మా గుండాల ప్రాంతంలో ఒకప్పుడు తాగునీటికి, సాగునీటికి నానా తిప్పలుండేవి. సాగునీరు లేక రైతులు వ్యవసాయం చేయడం సాధ్యంకాక అప్పుల పాలై బొంబాయి, హైదరాబాద్ వలస పోయ్యేది. కరువుతో అల్లాడేది… కానీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో మా గుండాల మండలానికి దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేస్తుండడంతో చెరువులు నిండి కరువు తీరింది. చెరువులు, కుంటలు నిండుకుండలా ఉండడంతో భూగర్భ జలాలు పెరిగి బావులు, బోర్లలో పుష్కలంగా నీరుంది. బీడు వారిన భూములు సైతం సాగులోకి వచ్చాయి. సాగు విస్తీర్ణం పెరిగింది. ఇన్నీ నీళ్లు చూస్తామని, చెరువులు, కుంటలు నీటితో నిండుకుండలా మారతాయని, ఇలాంటి రోజులు వస్తాయని కలలో కూడా ఊహించలేదు.
సంబురంగా ఉంది
ఇన్నేండ్లు నీళ్లు లేక గోస పడ్డాం. మాఊరి చెరువులకు గోదావరి జలాలు వస్తాయని కలలో కూడా అనుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్లతో చెరువులు నిండుతున్నాయి. చెరువులు, కుంటలన్నీ నిండి అలుగుపోస్తుంటే సంబురంగా ఉంది. గోదావరి జలాల రాకతో రైతులంతా సంతోషంగా ఉన్నారు.
-పుట్ట సాయిలు, రైతు, గోపాల్పురం, తుర్కపల్లి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కట్టంగూర్(నకిరేకల్), జనవరి 5 : మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్పై అబద్దాలు మాట్లాడిన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా క్షమాపణలు చెప్పాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. బుధవారం నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ జీర్ణించుకోలేక నిందలువేస్తున్నదని మండిపడ్డారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్పై నడ్డా చేసిన ఆరోపణలుపై ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర బీజేపీ నాయకులు రాసిన స్క్రిప్ట్ చదివిని నడ్డా నిజనిర్ధారణ చేసుకోని మాట్లాడాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేయడం కాకుం డా కేంద్రం నుంచి నిధులు తెప్పించి ప్రజాక్షేత్రంలోకి రావాలని బీజేపీ నాయకులు సవాల్ విసిరారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు వారి తీరు మార్చుకోలేకపోతే టీఆర్ఎస్ కర్యాకర్తలు, సీఎం కేసీఆర్ అభిమానులు ఊరుకోరని హెచ్చరించారు.