మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట, డిసెంబర్ 8: ఈ నెల 10న జరగున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్గోయల్ తెలిపారు. బుధవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుందని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని, హెల్త్ వర్కర్లను నియమించాలని సూచించారు. ఎన్నికల పోలింగ్ కేంద్రాల లోపలికి సెల్ ఫోన్లను అనుమతించకూడదన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ సామగ్రితో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి కేంద్రాలకు వెళ్లేటప్పుడు, తిరిగి పోలింగ్ ముగిశాక బ్యాలట్ బాక్స్లతో రిసెప్షన్ సెంటర్కు వచ్చేటప్పుడు బందోబస్తుతో రావాలన్నారు. ఓటర్ల గుర్తింపు కార్డులు లేదా భారత ఎన్నికల సంఘం సూచించిన 11 గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒకటి పరిశీలించాకే ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. పోలింగ్ అధికారులు ఇచ్చే వయొలెట్ పెన్నుతోనే బ్యాలెట్ పేపర్పై ప్రాధాన్యత క్రమంలో అంకెలు వేసేలా ఓటర్లకు చెప్పాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని, ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ నెల 14వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. మెదక్ జిల్లా నుంచి వీయోకాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, సహాయ ఎన్నికల అధికారి రమేశ్, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్, సెక్టోరల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ రమణకుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, అదనపు ఎస్పీ, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం నుంచి సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, సీపీ జోయల్ డెవిస్ పాల్గొన్నారు.