దాదాపు ఏడాదిన్నరగా కరోనా మనిషిని ఊపిరి తియనియ్యలేదు. ఆంక్షలు, కొవిడ్ భయంతో పండుగలు, శుభకార్యాలు ఆడంబరంగా చేసుకోలేకపోయాం. కరోనా తగ్గుముఖం పట్టి ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో పండుగలు ఘనంగా నిర్వహించుకోవడానికి జనం సిద్ధమవుతున్నారు. కరోనా తర్వాత చాలా రోజులకు మార్కెట్లు కళకళలాడుతున్నాయి. బతుకమ్మ, దసరా పండుగల కోసం ప్రజలు షాపింగ్ చేస్తుండడంతో దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. మార్కెట్లు, కూడళ్ల్లు, రహదారులు, ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ నెలకొన్నది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం అవుతున్నది. పేదల నుంచి ధనవంతుల వరకు పండుగలకు కావాల్సిన కొత్త బట్టలు, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. మహిళలు ఆభరణాలు, దుస్తులు, కాస్మోటిక్స్, చెప్పులు కొంటున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి, ఇతర అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా సొంతూర్లకు చేరుకుంటుండడంతో అంతటా సందడి వాతావరణం నెలకొన్నది. ఈసారి వ్యాపారం బాగా సాగుతున్నదని వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో రద్దీ నెలకొన్నది. మేకలు,నాటుకోళ్లు జోరుగా కొనుగోలు చేస్తున్నారు.
అందోల్/అమీన్పూర్,అక్టోబర్ : కరోనా తర్వాత చాలా రోజులకు మార్కెట్లు కళకళలాడుతున్నాయి. తెలంగాణలో పెద్ద పండుగలైన బతుకమ్మ, దసరా కోసం ప్రజలు షాపింగ్ చేస్తుండడంతో దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. మార్కెట్లు, కూడళ్ల్లు, రహదారులు, ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ నెలకొంది. పేదల నుంచి ధనవంతుల వరకు పండుగలకు కావాల్సిన కొత్త బట్టలు, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. మహిళలు ఆభరణాలు, దుస్తులు, కాస్మోటిక్స్, చెప్పులు కొనుగోళ్లు చేస్తున్నారు. అలాగే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి కోసం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా సొంతూర్లకు చేరుకుంటున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా మారాయి. గ్రామాల్లో సందడి నెలకొంది. పిల్లలు ఇంటికి చేరుకోవడంతో కుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. కరోనాతో ఏడాదిన్నరగా పండుగుల, ఇతరత్రా శుభకార్యాలయాలు ఆడంబరంగా నిర్వహించుకోలేక పోయాం. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటుండడంతో పండుగలు ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.
గ్రామాల్లో సందడి వాతావరణం…
వరుస పండుగలతో పల్లెలు సందడిగా మారాయి. వివిధ గ్రామాలు, వేరే ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు, ఆడబిడ్డలు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలకు పండుగశోభ వచ్చింది. ఏ ఇల్లు చూసినా సందడిగా మారింది. పట్టణాలతో పొల్చితే పల్లెల్లో పండుగ సంబురాలు అంబరాన్నంటుతాయి. బతుకమ్మ, దేవీనవరాత్రుల ఉత్సవాలు జరుగుతుండడంతో గ్రామాల్లో భక్తులు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో పల్లెలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సోమ, మంగళవారం కొన్నిచోట్ల సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహించగా, మరికొన్ని చోట్ల బుధ, గురువారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో బతుకమ్మకు అవసరమయ్యే పూలు, తదితర అలంకరణ సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లలో రద్దీ నెలకొంది. మండల కేంద్రాలు, ముఖ్య పట్టణాలు, గ్రామాల్లో పూలు, గాజుల దుకాణాలు భారీగా వెలిశాయి. దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరి కొనుగోలు చేస్తున్నారు. గతేడాది దసరా సమయంలో కొవిడ్తో వ్యాపారాలు సాగలేదు. ప్రస్తుతం వ్యాపారాలు బాగా సాగుతున్నాయని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రద్దీగా దర్శనమిస్తున్న ఆటోలు, బస్సులు..
దూర ప్రాంతాల్లో ఉన్నవారు స్వగ్రామాలకు చేరుకుంటుండడంతో ఆర్టీసీ బసులు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు రద్దీగా దర్శనమిస్తున్నాయి. పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు. మారుమూల గ్రామాలకు బస్సు సర్వీసులు లేకపోవడంతో ఆటోలకు డిమాండ్ ఏర్పడింది. పండుగల నేపథ్యంలో సంతలు కిటకిటలాడుతున్నాయి.
మేకలు, నాటు కోళ్లకు డిమాండ్..
పండుగల సందర్భంగా మాంసాహారంతో విందు భోజనాలు చేస్తుంటారు. పండుగపూట ముక్కలేనిదే ముద్ద దిగకపోగా, ఆ రోజు యాటలు తెగకపోతే అక్కడ పండుగ వాతావరణమే కనిపించదు. ఈ నేపథ్యంలో మేకలు, నాటు కోళ్ల కొనుగోళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం మార్కెట్లో మేకల ధరలు విపరీతంగా పెరిగాయి. మార్కెట్లో ఒక్కో మేక ధర ప్రారంభమే రూ.5, 6వేల వరకు పలుకుతున్నది. నాటు కోళ్ల ధరలు సైతం అమాంతం పెరిగిపోయి. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ఒక్కో నాటుకోడిని వ్యాపారులు మార్కెట్లో రూ.500 నుంచి రూ.800 వరకు విక్రయిస్తున్నారు.
షాపింగ్తో జేబులు ఖాళీ..
ఈ పండుగలకు షాపింగ్ చేస్తుంటే జేబులు ఖాళీ అవుతున్నాయి. అయినప్పటికీ సంతోషంగా ఖర్చు చేస్తున్నాం. సంవత్సరంలో ఒకసారి వచ్చే దసరా పండుగకు సంతోషంగా ఖర్చు చేస్తున్నాం. షాపింగ్కు వెళ్లాలంటే చాలా భయం వేస్తున్నది. ఎక్కడ చూసినా కిక్కిరిన జనం కనపడుతున్నది. రహదారులపై ట్రాఫిక్ జామ్ అవుతున్నది.
షాపింగ్ పూర్తిచేశాం..
ఈసారి బతుకమ్మ, దసరా పండుగకు షాపింగ్ పూర్తిచేశాను.షాపింగ్ సమయంలో దుకాణంలో రద్దీ ఎక్కువగా ఉంది. దుస్తులు కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడ్డాం. కుటుంబ సభ్యులమంతా కలిసి షాపింగ్ చేశాం. రెండేండ్ల తర్వాత ఈ పండుగలు ఘనంగా జరుపుకొంటున్నాం.
ఈసారి వ్యాపారం బాగుంది..
కరోనాతో రెండేండ్లుగా వ్యాపారం దెబ్బతిన్నది.ఈసారి బతుకమ్మ, దసరా, దీపావళి పర్వదినాలకు ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తున్నారు.దీంతో మా వ్యాపారం బాగుంది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం సాగిస్తున్నాం.ఈసారి చాలా సంతోషంగా ఉంది. కరోనా పూర్తిగా పోయి ప్రజలు సంతోషంగా ఉంటే వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి.