గద్వాలటౌన్, మే 18: జిల్లా దవాఖాన ప్రాంగణంలో ఆటోలోనే మహిళ ప్రసవించిన సంఘటన బుధవారం గద్వాలలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని భీంనగర్కు చెందిన అరుణకు బుధవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో ఆటోలో జిల్లా దవాఖానకు చేరుకున్నారు. దవాఖాన ప్రాంగణంలోకి చేరుకున్నాక నొప్పులు ఎక్కువవడంతో అరుణ బంధువులు వైద్యులను తీసుకొచ్చేందుకు లోపలికి వెళ్లారు. అంతలోనే నొప్పులు తీవ్ర తరం కావడంతో అరుణ ఆటోలోనే ప్రసవించింది. గమనించిన వైద్యులు, నర్సులు ఆమెను లోపలికి తీసుకెళ్లి పూర్తిస్థాయిలో చికిత్స అందించారు. దీంతో తల్లీబిడ్డా క్షేమంగా బయటపడ్డారు. ఇదిలా ఉండగా అరుణకు నొప్పులు ఎక్కువగా ఉన్నాయని త్వరగా రావాలని సంబంధిత వైద్యులను, సిబ్బందిని కోరినా పట్టించుకోలేదని అరుణ బంధువులు ఆరోపించారు. సమాచారం ఇచ్చిన అరగంటకు వైద్యులు స్పందించారన్నారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పరిపాటిగా మారిందని అరుణ బంధువులు ధ్వజమెత్తారు.
సరైన సమయంలో స్పందించాం
అరుణ బంధువులు సమాచారం ఇచ్చిన వెంటనే వైద్యులు, సిబ్బంది స్పందించారని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ తెలిపారు. సిబ్బంది వచ్చేలోపే నొప్పులు ఎక్కువగా రావడంతో కాన్పు అయ్యిందని, తర్వాత తల్లీబిడ్డకు మెరుగైన వైద్య సేవలు అందించామన్నారు. వైద్యులకు, సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు.