చార్మినార్ : విద్యార్థులు గ్రంథ పఠనం ద్వార లోతైన అధ్యాయనాలను పూర్తి చేసి సంబంధిత అంశాల్లో ప్రావీణ్యత సాధించవచ్చని సిటీ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ విప్లవ్దత్ శుక్లా తెలిపారు. సోమవారం సిటీ కాలేజీలో 54వ గ్రంథాలయ వారోత్సవాలను ఆయన ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలల్లో ఉన్న పురాతన పుస్తక గ్రంథాలను విద్యార్థులు వినియోగించుకుని విషయ పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. గ్రంథాలు విద్యార్థుల భవితవ్యాన్ని మార్చే అపురూప మార్గాలకు నిలయమని తెలిపారు. విద్యార్థులు సాగిస్తున్న విద్యాభోధనతోపాటు ఇతర విషయాలపై సైతం పట్టు సాధించాలని అభిలాషించారు.
రోజు వారి దినపత్రికలతోపాటు జర్నల్స్ పుస్తకాలను సైతం చదవాలని విజ్ఞప్తి చేశారు. నేటి పోటీ ప్రపంచంలో రాణించా లంటే అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం కోయి కోటేశ్వర్రావు మాట్లాడుతూ పుస్తకం విలువను, పుస్తక పఠనం గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నారు. అనంతరం సిటీ కాలేజీలో గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
సిటీ కాలేజీలోని పురాతన పుస్తకాలు, వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ యాదయ్య, డాక్టర్ రత్నప్రభ, నీరజ, శారద, ఆనంద్, భాస్కర్లతోపాటు విద్యార్థులు, భోదనేతర సిబ్బంది, గ్రంధాలయ సిబ్బంది తబుస్సుం ఫాతిమా, బాలేష్ తదితరులు పాల్గొన్నారు