వెంగళరావునగర్ : పేద రోగులకు ఖరీదైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ సర్కారు ఎర్రగడ్డలోని ప్రభుత్వ చెస్ట్ దవాఖానాలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఎలర్జీ క్లీనిక్ను ప్రారంభించింది. ఎలర్జీ క్లీనిక్ను బుధవారం ఛాతీ దవాఖానా సూపరింటెండెంట్ మహబూబ్ఖాన్తో కలిసి రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ కె.రమేష్రెడ్డి ప్రారంభించారు.
ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యశాఖ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలర్జీ సమస్యను ప్రస్తావించారని, ఎక్కువ మంది బాధితులు ఎలర్జీతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఈ తరహా క్లీనిక్లను ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ క్లినిక్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
చర్మ సంబంధ ఎలర్జీలు, ఆహార పదార్థాలకు సంబంధించిన ఎలర్జీలు, వాతావరణ మార్పులతో వచ్చే ఎలర్జీలతో పేద రోగులు ఇబ్బందులు పడ్తుంటారని, పేద రోగులు ఖరీదైన వైద్యాన్ని పొందలేక నిస్సహాయస్థితిలో ఉండేవారని.. ఇప్పుడు అలాంటి పేదరోగులకు ఈ అలర్జీ క్లినిక్ ఎంతగానో ఉపయోగపడ్తుందని పేర్కొన్నారు.
దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఎలర్జీ క్లినిక్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిదని..పేద రోగులకు ఈ ఎలర్జీ క్లినిక్ ఎంతగానో ఉపయోగపడ్తుందని పేర్కొన్నారు. నిరుపేద రోగులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అంతకు ముందు డీఎంఈ డాక్టర్ రమేష్రెడ్డికి ఎలర్జీ క్లీనిక్ ప్రత్యేకతలు, చికిత్సా విధానాలు, పరీక్షలను వైద్య నిపుణులు వివరించారు. అనంతరం క్లీనిక్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో దవాఖానా ఆర్ఎంఓ డాక్టర్ నరేందర్, డాక్టర్ నళిని తదురులు పాల్గొన్నారు.