సిద్దిపేట : సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ వందశాతం కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపడుదామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట అర్బన్ , సిద్దిపేట రూరల్ , నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్ , సర్పం చ్ లు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లతో మొత్తం 224 మందితో గురువారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం, సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించాలని దిశా నిర్దేశం చేశారు.
ప్రభుత్వపరంగా పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ ఎంలు, ఆరోగ్య సిబ్బందికి స్పష్టమైన ఆదేశాల జారీ చేసిందని, ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో 18 ఏండ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్ వేసుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు తీసుకోవాలని సూచించారు. ఆయా వార్డులు, గ్రామ, పట్టణ పరిధుల్లోని అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏఎన్ ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్ వాడీ, ఆరోగ్య సిబ్బందితో పాటు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ , స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశాలు నిర్వహించి సమన్వయంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలన్నారు.
గత వారం రోజులుగా డెంగీ, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, వాటిని అరికట్టేలా వాటర్ ట్యాంకులు, డ్రైనేజీలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టి పట్టణంలో ఫాగింగ్ చేయాలని సూచించారు. సకాలంలో అన్ని ప్రాంతాల్లో శానిటైజేషన్ , స్పెషల్ డ్రైవ్ చేపట్టి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు.