కామారెడ్డి టౌన్, జనవరి 2: ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను విధించిందని, వాటిని ప్రతి ఒక్కరూ పాటించాలని కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్రెడ్డి సూచించారు. ఆంక్షలు ఈ నెల 10వ తేదీ వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. జన సమూహాలుగా ఉండే రాజకీయ, మత, సాంస్కృతిక పరమైరమైన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసనలు నిర్వహించరాదని తెలిపారు. వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, రవాణా సంస్థలు రోజువారి కార్యక్రమాల్లో తప్పకుండా కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని కోరారు. తరచూ వారు ఉంటున్న ప్రదేశాన్ని శానిటైజ్ చేయాలన్నారు. చేతులు క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలన్నారు. విద్యా సంస్థల్లో విద్యార్థులు, అధ్యాపకులు తప్పకుండా మాస్కు ధరించాలని సూచించారు. మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.