ఖమ్మం, జనవరి 5 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. దీనిలో భాగంగా జనాభా ప్రతిపాదికన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మండల, జిల్లా పరిషత్లకు ప్రత్యేక నిధులను విడుదల చేసింది. ఖమ్మం జిల్లా పరిషత్కు రూ.6.67 కోట్లు విడుదల కాగా జిల్లాలోని 21 మండలాలకు గాను 20 మండల పరిషత్లకు రూ.6.58 కోట్ల నిధులు విడుదలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్కు రూ. 5.62 కోట్లు, మండల పరిషత్లకు రూ. 5.54 కోట్ల నిధులను విడుదల చేసింది. మండల పరిషత్, జిల్లా పరిషత్కు వేర్వేరుగా ప్రత్యేక నిధులు విడుదల చేయడంతో ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులతో ఎంపీటీసీ, జడ్పీటీసీలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. జిల్లా, మండల పరిషత్ల ద్వారా గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయాలని సంకల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక గ్రాంట్ కింద రాష్ట్రవ్యాప్తంగా రూ. 250 కోట్ల నిధులను విడుదల చేశారు. గ్రామ పంచాయతీ నిధులతో సంబంధం లేకుండా ఈ నిధులను ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు కేటాయించారు. మండల పరిషత్ విడుదలైన నిధులను ప్రజా పరిషత్ అధ్యక్షుడు ఎంపీటీసీల నిర్ణయాధికారం మేరకు ఖర్చు చేయనున్నారు. తమ ప్రాదేశిక నియోజకవర్గ పరిధిలో గల పలు సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఇందుకు ఆ యా మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను ఆమోదించాల్సి ఉంది. అలాగే జిల్లా పరిషత్కు మంజూరైన నిధులను జడ్పీటీసీలు అభివృద్ధి పనులకు వినియోగించనున్నారు. ఇందుకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులపై తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఈ నిధులు ఏ రకంగా ఉపయోగించాలి, వీటితో ఏ అభివృద్ధి పనులు నిర్వహించాలన్న అంశంపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఇప్పటికే అనేక మండల పరిషత్కు ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు(ఎంపీటీసీలు), జడ్పీటీసీలు ఆయా అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి సంబంధిత అధికారులకు నివేదించారు. ప్రధానంగా ఈ నిధులతో ప్రభుత్వ పాఠశాలలు, రహదారుల మరమ్మతులు, నిర్మాణం వంటి పనులు చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాలు రావడమే తరు వాయి గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెట్టనున్నది.
మార్గదర్శకాలు రావాల్సి ఉంది
మండల పరిషత్, జిల్లా పరిషత్లకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. వీటిని ఏయే అభివృద్ధి పనులకు వినియోగించాలి, ఏ కార్యక్రమాలు చేపట్టాలని అనే అంశంపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఈ నిధులతో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పనులను చేపట్టనున్నాం.