కల్లూరు, జనవరి 2 : నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడిన మహనీయుడు దివంగత మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కొనియాడా రు. ఆదివారం కల్లూరు మండలం పోచవరం గ్రామంలో కట్టా తనయుడు, జడ్పీటీసీ కట్టా అజయ్బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఎమ్మెల్సీలు తాతా మధు, బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కట్టా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కట్టా వెంకటనర్సయ్య ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మధిర నియోజకవర్గంలో రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీలో గళమెత్తి ప్రజాసమస్యలపై పోరాటం సాగించారని పేర్కొన్నారు. జీవితాన్ని చివరి వరకూ ప్రజల కోసమే ధార పోశారని, అలాంటి ప్రజానేత మరొకరు లేరని కొనియాడారు. కట్టా వెంకటనర్సయ్య కుమార్తె కంచర్ల నాగవేణి తన తండ్రి పేరు మీద రచించిన జీవిత చరిత్ర పుస్తకాన్ని మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ సీపీఎంలో కీలక నేత కట్టా వెంకటనర్సయ్య అని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే పార్టీలో చురుగ్గా తిరుగుతూ పేరు ప్రఖ్యాతలు సాధించారన్నారు. లింగాల కమల్రాజు, తాతా మధు, బాలసాని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ వెంకటనర్సయ్య సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పోట్ల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎంపీపీ బీరవల్లి రఘు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, సొసైటీ వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా, మండల సభ్యులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, డీసీసీబీ డైరెక్టర్ లక్ష్మణ్రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులతోపాటు ఏసీపీ వెంకటేశ్, రూరల్ సీఐ కరుణాకర్, సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎస్సైలతోపాటు పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.