కామారెడ్డి, డిసెంబర్ 8: వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా పూర్తిచేసేందుకు అధికార యంత్రాంగం సైతం చర్యలు తీసుకుంటున్నది. ధాన్యం సేకరణలో జాప్యం జరుగకుండా ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, ఏఎంసీ, సొసైటీల ప్రతినిధులు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని సీరియల్ ప్రకారం కాంటా చేస్తున్నారు. కొన్ని చోట్ల వివిధ కారణాలతో ధాన్యం సేకరణ ఆలస్యమవుతున్నది. ధాన్యంలో తేమశాతం ఎక్కువగా ఉంటే మద్దతు ధర వచ్చేలా.. వడ్లను ఇంకా ఆరబెట్టాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు సూచిస్తారు. మరోవైపు ఎఫ్సీఐ గోదాములు నిండిపోవడం, అన్లోడింగ్ వంటి సమస్యలతో ధాన్యం సేకరణలో ఆలస్యమవుతున్నది. తాడ్వాయి మండల పరిధిలోని నందివాడ గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం సేకరణ సజావుగానే కొనసాగుతున్నది. అదే గ్రామానికి చెందిన రైతు మంత్రి నారాయణకు చెందిన వడ్లను నెల రోజులుగా కాంటా పెట్టడం లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని సెంటర్ నిర్వాహకుడు అశోక్ స్పష్టం చేశారు. నారాయణకు చెందిన వరిని ఇటీవల కురిసిన వర్షాలు తగ్గిన వెంటనే కోయడంతో వడ్లకు నిబంధనల మేరకు తేమశాతం రాలేదని, దీంతో కొనుగోలు కేంద్రంవద్దనే ఉంచామని తెలిపారు. బుధవారం సాయంత్రం నారాయణకు చెందిన 28 బస్తాల ధాన్యాన్ని కాంటాచేసి రైస్మిల్లుకు తరలించామని చెప్పారు.
సీరియల్ ప్రకారమే కాంటా..
రైతులు తెచ్చిన సీరియల్ ప్రకారమే వడ్లు కొంటాం. నందివాడలో ఇప్పటి వరకు 7,700 బస్తాలు సేకరించాం. రెండు, మూడు రోజులకో లారీని లోడ్చేసి రైస్ మిల్లుకు పంపుతున్నాం. మిల్లుల వద్ద అన్లోడింగ్ సమస్య ఉంది. ధాన్యం బిల్లులు పది రోజుల్లోనే వస్తున్నాయి. వడ్లల్లో తేమశాతం ఎక్కువ ఉంటేనే కాంటా ఆలస్యవుతుంది.
-కపిల్ రెడ్డి, డీసీఎంఎస్ డైరెక్టర్,తాడ్వాయి పీఏసీఎస్ చైర్మన్