బన్సీలాల్పేట్ : నీట్ 2021-22 పరీక్షలో ఇన్ సర్వీస్ కోటాకు రిజర్వేషన్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజ్లో సోమవారం జూనియర్ డాక్టర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.కార్తిక్, గాంధీ యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ మణికిరణ్ రెడ్డిలు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 155ను విడుదల చేసి, ఎంబీబీఎస్ పూర్తి చేసి, గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందించిన ఇన్ సర్వీస్ డాక్టర్లకు పీజీ చేయడానికి నీట్ 2021-22 ఏడాది నుండి ప్రత్యేక కోటా రిజర్వేషన్ కేటాయించిందని అన్నారు.
నీట్లో 50 శాతం ఆల్ ఇండియా కోసం సీట్లు రిజర్వు ఉంటాయని, మిగిలిన దాంట్లో తమ లాగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి సీట్లను కేటాయిస్తారని అన్నారు. ఇప్పుడు తాజాగా, ఇన్ సర్వీస్ వారికి కూడా సీట్లు కేటాయిస్తే తమకు చాలా తక్కువ సీట్లు మిగులుతాయని అన్నారు.
స్పెషలైజేషన్ చేయడానికి నీట్లో ప్రస్తుతం చాలా పెద్ద ఎత్తున పోటీ నెలకొందని, అందులో వీటన్నిటిని అధిగమించి, సీటు సంపాదించడం మరింత కష్టంగా మారబోతుందని అన్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే ఆ జీఓను వెనక్కి తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామని వారు అన్నారు.
లేదంటే నవంబర్ 26 నుండి తాము రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరిస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రతినిథుల బృందం కోఠీలోని డిఎంఈ కార్యాలయానికి వెళ్ళి ఆయనకు వినతి పత్రం అందజేశారు.