పహాడీషరీఫ్ : జల్పల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8,10, 27 వార్డుల్లో రూ. 41 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు, అండర్ గ్రౌడ్ డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పెండింగ్ పనులపై కమిషనర్తో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణాలు చేపట్టి మురుగు సమస్య లేకుండా చేస్తామన్నారు. నాలాల మరమ్మతుల పనులు, వరద ముంపు సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దాహార్తిని తీర్చేందుకు , ఫేస్-2లో భాగంగా రూ. 60 కోట్లతో పైపులైన్ పనులు, రిజర్వాయర్ల నిర్మించనున్నట్లు తెలిపారు.
ఈ నెల 29న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. వాది ఏ సాలెహీన్ కాలనీకి రూ. కోటి 60లక్షలు, ఎరకుంటలో రూ. కోటితో డ్రైనేజీ పనులకు నిధులు కేటాయించామన్నారు. ప్రధార రహదారుల్లో రూ. 50 లక్షలతో లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
చైర్మన్ అబ్దుల్లా సాది, వైస్ చైర్మన్ ఫర్హాన నాజ్, కమిషనర్ జి.పి కుమార్, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ఇక్బాల్ బిన్ ఖలీఫా, కౌన్సిలర్లు శంషొద్దీన్, మజర్ అలీ, నాయకులు యూసుఫ్ పటేల్, మహిబూబ్ హసన్బాబ, యాస్మిన్ బేగం, ఎజాజ్ పటేల్, యాతం పవన్కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.